Amaravati: విద్యా రాజధానిగా అమరావతి.. తరలివస్తున్న దిగ్గజ సంస్థలు

Amaravati Emerging as Educational Hub with Top Institutions
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, దేశంలోనే ఒక ప్రధాన విద్యా కేంద్రంగా (ఎడ్యుకేషనల్ హబ్) శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ, పక్కా ప్రణాళికతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు అమరావతిని తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. దీంతో రాజధాని ప్రాంతం సకల చదువుల కూడలిగా కొత్త శోభను సంతరించుకుంటోంది.

ఇప్పటికే వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్-ఏపీ), ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) వంటి సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించి  విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఈ సంస్థల విస్తరణకు కూడా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఇటీవల నీరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 60 మీటర్ల ఎత్తు వరకు అకడమిక్ భవనాల నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం ఇందుకు నిదర్శనం.

ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ), ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వంటి దిగ్గజాలు అమరావతిలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. దేశంలోనే తొలి ‘ఏఐ ప్లస్’ క్యాంపస్‌ను బిట్స్ పిలానీ ఇక్కడ నిర్మిస్తోంది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో, 7,000 మంది విద్యార్థుల సామర్థ్యంతో ఈ క్యాంపస్ నిర్మాణం జరుగుతోంది. అలాగే, జంషెడ్‌పూర్, ఢిల్లీ తర్వాత దేశంలో మూడో క్యాంపస్‌ను ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ అమరావతిలో ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సీఆర్డీఏతో ఒప్పందం కూడా కుదిరింది.

విశ్వవిద్యాలయాలతో పాటు పాఠశాల విద్యకు కూడా అమరావతిని కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్మయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం, డీఏవీ గ్రూప్ ఆధ్వర్యంలో రైతు విద్యాలయం సహా పలు అంతర్జాతీయ పాఠశాలలు తమ క్యాంపస్‌లను ఇక్కడ ఏర్పాటు చేయనున్నాయి. విద్యాసంస్థల ఏర్పాటు కోసం ఏపీసీఆర్‌డీఏ ఇప్పటికే 18 సంస్థలకు 838 ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. ఈ పరిణామాలతో అమరావతి భవిష్యత్తులో దేశ విద్యాపటంలో కీలక స్థానాన్ని అందుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Amaravati
Educational Hub Amaravati
APCRDA
VIT AP
SRM University
Amrita University
NID
BITS Pilani
XLRI Jamshedpur

More Telugu News