Kandula Durgesh: గోదావరి పుష్కరాలలోగా 'అఖండ గోదావరి' పూర్తి చేయాలి: అధికారులకు మంత్రి దుర్గేశ్ ఆదేశం

Kandula Durgesh Orders Completion of Akhanda Godavari Before Godavari Pushkaralu
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగాన్ని ఒక ముఖ్యమైన 'గ్రోత్ ఇంజిన్‌'గా తీర్చిదిద్దాలని, ఈ రంగంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నిర్వహించనున్న సమీక్షకు సన్నద్ధమయ్యే క్రమంలో నిన్న సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విశాఖపట్నంలో రూ.100 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక అమ్యూజ్‌మెంట్ పార్క్, రిసార్ట్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై కీలక చర్చ జరిగింది. ఇటీవల ముంబయిలో జరిగిన ఎక్స్‌పోలో మెసర్స్ మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్‌తో పర్యాటక శాఖ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) గురించి ఆ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. వీఎంఆర్డీఏ పరిధిలో ప్రాజెక్టుకు అనువైన స్థలాలను గుర్తించామని, ప్రభుత్వం వేగంగా స్పందించి సహకరించడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పర్యాటకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అనుమతుల మంజూరులో జాప్యం ఉండదని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.

సమీక్షా సమావేశంలో భాగంగా, గోదావరి పుష్కరాల లోపే 'అఖండ గోదావరి' ప్రాజెక్టును పూర్తి చేయాలని మంత్రి దుర్గేశ్ అధికారులను ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు వినూత్న నిర్ణయాలు తీసుకోవాలని, బాధ్యతాయుత పర్యాటకాన్ని ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీటీడీసీకి రాబోయే 15 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక, నూతన పెట్టుబడులు, కేంద్ర నిధులతో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. 'స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047'లో భాగంగా వినోద రంగాన్ని అభివృద్ధిలో కీలక చిహ్నంగా మలచడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీడీసీ ఈడీలు పద్మావతి, శేషగిరిరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Go Back to Shorts
Kandula Durgesh
Andhra Pradesh Tourism
Tourism Development
Godavari Pushkaralu
Akhanda Godavari Project
Visakhapatnam Amusement Park
AP Tourism
Swarnandhra Tourism Vision 2047
Nara Chandrababu Naidu
APTDCD

More Telugu News