Jagan Mohan Reddy: జగన్ చేయగలిగింది బాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది: జగన్
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు ఒంగోలు నియోజకవర్గ కేడర్తో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్... కూటమి ప్రభుత్వంపై తన విమర్శనాస్త్రాలకు మరింత పదును పెట్టారు. వైసీపీకి 'గుండె ధైర్యం' అనేది ఒక ట్రేడ్ మార్క్ అని... విలువలు, విశ్వసనీయతే పార్టీకి పునాదులని ఆయన అన్నారు.
జగన్ చేయగలిగింది బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జరుగుతోందని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 'దోచుకో.. పంచుకో.. తినుకో..' అనే విధానం సాగుతోందని, అమరావతి పనుల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదని, ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అవినీతి కోసమే వారు అధికారంలో ఉన్నారని, ఎన్నికల హామీలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఈ భేటీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ముఖ్య నేతలు పాల్గొన్నారు.