India Post: మరుసటి రోజే గ్యారెంటీ డెలివరీ.. తపాలా శాఖ నుంచి సరికొత్త సర్వీస్

India Post Introduces 24 Hour Delivery with 24 Speed Post
షార్ట్స్‌లో చూడండి
పార్శిళ్లు, ఇతర వస్తువుల డెలివరీలో వేగాన్ని పెంచేందుకు భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) కీలక ముందడుగు వేసింది. '24 స్పీడ్ పోస్ట్' పేరుతో సరికొత్త ఎక్స్‌ప్రెస్ సర్వీసును మంగళవారం (మార్చి 17) ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని ద్వారా అత్యవసరమైన పార్శిళ్లను కేవలం 24 గంటల్లోనే గ్యారెంటీగా డెలివరీ అందించనుంది.

కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొంటారు.

తొలి దశలో ఈ '24 స్పీడ్ పోస్ట్' సేవలు దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లలో అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలతో పాటు, మరుసటి రోజు డెలివరీ (D+1) అందించే '24 స్పీడ్ పోస్ట్', రెండు రోజుల్లో డెలివరీ (D+2) అందించే '48 స్పీడ్ పోస్ట్' సేవలను కూడా ప్రవేశపెడుతున్నారు. వీటికి ప్రత్యేక ప్రాసెసింగ్ విండోలు, విమానాల్లో ప్రాధాన్యత కల్పించనున్నారు.

ఈ కొత్త సేవల్లో ఓటీపీ ఆధారిత సురక్షిత డెలివరీ, ఎస్ఎంఎస్ అలర్ట్‌లతో కూడిన ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. వ్యాపార వినియోగదారుల కోసం 'బై నౌ పే లేటర్' (BNPL) సదుపాయం, బల్క్ బుకింగ్స్‌పై ఉచిత పికప్, ఏపీఐ ఇంటిగ్రేషన్ వంటివి కూడా అందిస్తున్నట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకవేళ డెలివరీలో ఆలస్యం జరిగితే 'మనీ బ్యాక్ గ్యారెంటీ' కూడా ఇస్తామని, ఇది ఇండియా పోస్ట్ ప్రీమియం సేవలను మరింత బలోపేతం చేస్తుందని వివరించింది.

దేశవ్యాప్తంగా పార్శిల్, ఈ-కామర్స్ రంగంలో సేవలను విస్తరించి, ఓ ప్రధాన లాజిస్టిక్స్ సంస్థగా మారేందుకు తపాలా శాఖ అనేక చర్యలు చేపడుతోందని ఈ నెల మొదట్లో మంత్రి పెమ్మసాని లోక్‌సభలో వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నూతన సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.
Go Back to Shorts
India Post
24 Speed Post
Jyotiraditya Scindia
Chandrasekhar Pemmasani
postal service
express delivery
same day delivery
money back guarantee
logistics
e-commerce

More Telugu News