Harish Rao: గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు తెలంగాణ వాసుల పాలిట శాపంగా మారాయి: హరీశ్ రావు
- యుద్ధ క్షేత్రంలో చిన్నపిల్లలు, సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారని హరీశ్ ఆవేదన
- ఈ అశాంతి త్వరగా ముగిసిపోవాలని ఆకాంక్షించిన మాజీ మంత్రి
- యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న హరీశ్
గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారడమే కాకుండా, అక్కడున్న భారతీయులు, తెలంగాణ వాసుల పాలిట శాపంగా మారాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, యుద్ధ క్షేత్రంలో నిరపరాధులైన చిన్నపిల్లలు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ అశాంతి త్వరగా ముగిసి అంతటా శాంతి వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జీవనోపాధి పొందుతున్న భారతీయులు, అందునా తెలంగాణ వాసులు ప్రస్తుత పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు గుర్తుచేశారు. యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతోందని పేర్కొన్నారు. కేవలం అంతర్జాతీయ పరిస్థితులే కాకుండా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు.
ముస్లిం సమాజానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని హరీశ్రావు మండిపడ్డారు. ఇమామ్లు, మౌజన్లకు అందాల్సిన నెలసరి భత్యాలను ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొడుతోందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం పేదలకు రూ. 5 వేల ఆర్థిక సాయం అందించగా, కాంగ్రెస్ దానిని రూ. 10 వేలకు పెంచుతామని చెప్పి ఇప్పుడు మొహం చాటేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.