'అబ్రహాం లింకన్'పై ఇరాన్ దాడి... అంతా వట్టిదేనన్న అమెరికా సెంట్రల్ కమాండ్
- యూఎస్ఎస్ అబ్రహాం లింకన్పై దాడి చేశామన్న ఇరాన్
- ఇరాన్ ప్రకటనను ఖండించిన అమెరికా సెంట్రల్ కమాండ్
- క్షిపణులు నౌక దరిదాపుల్లోకి కూడా రాలేదని స్పష్టీకరణ
- మా ఆపరేషన్స్ యథాతథంగా కొనసాగుతున్నాయని వెల్లడి
తమ అగ్రనేత మరణానికి ప్రతీకారంగా అమెరికా యుద్ధ నౌకపై నాలుగు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశామని ఇరాన్ ప్రచారం చేసుకుంది. అయితే, దీనిపై స్పందించిన అమెరికా సైన్యం ఓ ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు అబ్రహాం లింకన్ నౌక దరిదాపుల్లోకి కూడా రాలేదని, నౌకకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని తేల్చి చెప్పింది. ఇరాన్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని అమెరికా మండిపడింది.
తమ నౌక పూర్తిగా సురక్షితంగా ఉందని, ఎప్పటిలాగే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి, అమెరికా పౌరులను రక్షించడానికి తాము చేపట్టిన ఆపరేషన్లలో భాగంగా.. అబ్రహాం లింకన్ నుంచి యుద్ధ విమానాలు యథావిధిగా నింగిలోకి ఎగురుతున్నాయని స్పష్టం చేసింది. ఇరాన్ దాడులను, బెదిరింపులను తిప్పికొట్టేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని పేర్కొంది.