Chandrababu Naidu: పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్... సీఎం చంద్రబాబు కొత్త విధానం

Chandrababu Naidu Prioritizes Employee Performance Based Weightage
  • ఉత్తమ పనితీరు కనబరిచే వారికి అభినందన లేఖలు పంపాలని సీఎం ఆదేశం
  • రెవెన్యూ శాఖకు ఉన్న చెడ్డపేరు పోవాలి, ఫ్రెష్ లుక్ తీసుకురావాలని దిశానిర్దేశం
  • ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చూడాలని, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచన
  • టెక్నాలజీ ఆధారిత సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ
ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచడంతో పాటు, ఉద్యోగుల్లో నూతనోత్సాహం నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఉద్యోగుల పనితీరు ఆధారంగా వారికి వెయిటేజ్ ఇవ్వాలని, ఉత్తమ పనితీరు కనబరిచే వారిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు పంపాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పనితీరును ప్రోత్సహించే ఈ నూతన విధానాన్ని ప్రకటించారు.

క్షేత్రస్థాయిలో ప్రజల మన్ననలు పొందుతూ, అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బందిని గుర్తించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. పనితీరు సరిగా లేని వారిని గుర్తించి ప్రేరణ కల్పించడంతో పాటు, బాగా పనిచేస్తున్న వారిని ప్రశంసించడం ద్వారా ఉద్యోగుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వం పెరుగుతుందని ఉన్నతాధికారులు సైతం ఏకీభవించారు. 

"ప్రతి నెలా ఉత్తమ పనితీరు కనబరిచే ఉద్యోగులను గుర్తించి, వారికి అభినందన లేఖలు పంపాలి. ఈ ప్రశంసలను వారి సర్వీస్ రికార్డులలో కూడా నమోదు చేయాలి. ఇది వారి కెరీర్‌కు దోహదపడుతుంది," అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విధానం ప్రభుత్వ ఉద్యోగులను అభినందించడంలో ఒక కొత్త అధ్యాయమని, దీని ద్వారా పాలనలో మరింత సానుకూల మార్పు వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ఆసుపత్రులు, దేవాలయాలపై ప్రత్యేక దృష్టి

వైద్యారోగ్యం, దేవదాయ శాఖల పనితీరుపై సమీక్షిస్తూ సీఎం పలు కీలక సూచనలు చేశారు. "ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని స్థాయిల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను బాధ్యులను చేయండి. పారిశుద్ధ్యం, వైద్య పరికరాల నిర్వహణపై ఆసుపత్రుల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు పూర్తి బాధ్యత అప్పగించాలి. ఏ ఆస్పత్రిలోనూ వైద్యుల కొరత ఉండకూడదు. అవసరమైన చోట తక్షణం నియామకాలు చేపట్టేలా కలెక్టర్లతో సమన్వయం చేసుకోండి" అని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే, దేవాలయాల్లో భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలని, ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా చూడాలని దేవదాయ శాఖ అధికారులకు సూచించారు.

రెవెన్యూకు ఫ్రెష్ లుక్.. టెక్నాలజీతో అవగాహన

రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. "రెవెన్యూ శాఖకు ఉన్న చెడ్డపేరు పోవాలి. గతంతో పోల్చుకుంటే స్పష్టమైన మార్పు కనిపించాలి. ఈ శాఖకు ఒక ఫ్రెష్ లుక్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రీ-సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించాలి. రెవెన్యూ సేవలను పూర్తిగా ఆటోమేషన్ పరిధిలోకి తెస్తాం. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఏసీబీని రంగంలోకి దించాల్సి వస్తుంది. సరిగా పనిచేయని తహసీల్దార్లను పక్కనపెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు" అని హెచ్చరించారు.

అదేవిధంగా, తాగునీటి సరఫరాలో నాణ్యతను కాపాడాలని, ఎప్పటికప్పుడు నీటి నమూనాలను పరీక్షించాలని ఆదేశించారు. ల్యాబ్‌లు అందుబాటులో లేని ప్రాంతాల్లో మొబైల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై ఆడిట్ నిర్వహించి, నివారణ చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు సూచించారు. ప్రభుత్వం టెక్నాలజీ సాయంతో అందిస్తున్న సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు మీ-సేవ కేంద్రాలు, డ్వాక్రా సంఘాల ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రెవెన్యూ, వైద్యారోగ్యం, దేవదాయ, రవాణా, పట్టణాభివృద్ధి తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Government employees
Employee performance
Incentives
RTGS
Review meeting
Governance
Public services
Technology

More Telugu News