GHMC: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్‌ విభజన

GHMC Divided into Three Corporations by Telangana Government
  • జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • సైబరాబాద్, మల్కాజ్‌గిరి పేర్లతో రెండు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు
  • మూడు సంస్థలకు వేర్వేరుగా కమిషనర్ల నియామకం
  • పాలన వికేంద్రీకరణ, పౌర సేవలు మెరుగుపరచడమే లక్ష్యం
  • మొత్తం 300 వార్డులు, 60 సర్కిళ్లతో నగర పాలన పునర్‌వ్యవస్థీకరణ
హైదరాబాద్ మహానగర పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను మూడు కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పునర్‌వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పేరుతో రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నగర జనాభా, విస్తీర్ణం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, జవాబుదారీతనాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జీహెచ్ఎంసీ చట్టం, 1955లోని సెక్షన్ 3(1) ప్రకారం ఈ విభజన ప్రక్రియను పూర్తి చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు.

కొత్త కమిషనర్లు, జోన్ల కేటాయింపు

ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆర్.వి. కర్ణన్‌ను అదే పదవిలో కొనసాగించింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా పనిచేస్తున్న జి. సృజనను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, టి. వినయ్ కృష్ణారెడ్డిని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించింది. ఈ మూడు కార్పొరేషన్ల మధ్య సమన్వయం కోసం జయేష్ రంజన్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది.

కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ల పరిధిని జోన్ల వారీగా స్పష్టంగా నిర్వచించారు.

  • జీహెచ్ఎంసీ: శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు.
  • సైబరాబాద్ కార్పొరేషన్: శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు.
  • మల్కాజ్‌గిరి కార్పొరేషన్: మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్.బి. నగర్ జోన్లు.

విభజన నేపథ్యం

గత ఏడాది డిసెంబర్‌లో 27 చుట్టుపక్కల పట్టణ స్థానిక సంస్థలను (ULB) జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో దాని పరిధి సుమారు 2,000 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఈ నేపథ్యంలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు, సర్కిళ్ల సంఖ్యను 30 నుంచి 60కి పెంచుతూ డిలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారు. పెరిగిన పరిధికి అనుగుణంగా పాలనను సులభతరం చేసేందుకే తాజాగా ఈ మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 60 సర్కిళ్లలో జీహెచ్ఎంసీకి 30, సైబరాబాద్‌కు 16, మల్కాజ్‌గిరికి 14 సర్కిళ్లను కేటాయించారు.

ఈ విభజనతో మూడు కార్పొరేషన్లు ప్రత్యేక చట్టబద్ధ సంస్థలుగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కాగా, సైబరాబాద్ నూతన కమిషనర్‌గా జి. సృజన ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. ఈ పునర్‌వ్యవస్థీకరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కావడంతో పాటు, స్థానిక సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని అధికారులు భావిస్తున్నారు.
GHMC
Hyderabad
Telangana Government
Cyberabad Municipal Corporation
Malkajgiri Municipal Corporation

More Telugu News