Narendra Modi: నమ్మకమే మనకు అతి పెద్ద కరెన్సీ: మలేషియాలో ప్రధాని మోదీ

Narendra Modi says Trust is Biggest Currency in Malaysia
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచ వృద్ధికి భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోందని, నమ్మకమే దేశానికి 'అతిపెద్ద కరెన్సీ'గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం మలేషియా చేరుకున్న ఆయన, కౌలాలంపూర్‌లో భారత సంతతిని ఉద్దేశించి ప్రసంగించారు. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని, ఇది మన దేశంపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని సూచిస్తోందని తెలిపారు.

ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం విమానాశ్రయంలోనే సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు ఒకే కారులో కార్యక్రమ వేదికకు చేరుకోవడం విశేషం. భారత్-మలేషియా సంబంధాలకు 'ఇంపాక్ట్' (IMPACT - India Malaysia Partnership for Advancing Collective Transformation) అనే పదం మార్గనిర్దేశం చేస్తుందని మోదీ తెలిపారు. భారత్ విజయం మలేషియాకు, ఆసియాకు కూడా విజయమని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద భారత సంతతి మలేషియాలో ఉందని, వారు ఇరు దేశాల మధ్య బలమైన వారధిగా నిలుస్తున్నారని మోదీ ప్రశంసించారు. మలేషియాలోని 500కి పైగా పాఠశాలల్లో భారతీయ భాషలను బోధిస్తున్న విషయాన్ని తాను 'మన్ కీ బాత్' కార్యక్రమంలో పంచుకున్నట్లు గుర్తుచేశారు. శతాబ్దాలుగా భారతీయ సంప్రదాయాలను కాపాడుతున్న తీరు అద్భుతమని కొనియాడారు.

ముఖ్యంగా, తమిళ సమాజం శతాబ్దాలుగా ఇక్కడ సేవలు అందిస్తోందని చెబుతూ, మలయా యూనివర్సిటీలో తిరువళ్లువార్ చైర్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ఈ వారసత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు త్వరలో తిరువళ్లువర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మలేషియాలోని భారతీయులంతా తమ మిత్రులతో కలిసి 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా'ను సందర్శించాలని మోదీ ఆహ్వానించారు.
Go Back to Shorts
Narendra Modi
Malaysia
India
Anwar Ibrahim
India Malaysia relations
Indian diaspora
Trade agreements
Malaya University
Tiruvalluvar
Man Ki Baat

More Telugu News