KCR: మరో రెండేళ్లలో కేసీఆర్ సీఎం అవుతారు... అప్పుడు మిగిలిన పనులు చేసుకుందాం: హరీశ్ రావు

KCR Will Be CM Again in Two Years Says Harish Rao
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో రెండేళ్లలో మరోసారి ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేసుకుందామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఏమీ చేయరని విమర్శించారు. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ, మనల్ని బాగా చూసుకునే వారికే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఒకప్పుడు పందులతో ఉన్న గజ్వేల్ ఆసుపత్రి కేసీఆర్ వచ్చాక ఎలా అయిందో అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది కానీ వాటిని అమలు చేయలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి ఇవ్వలేదు కానీ బంగారం ధర మాత్రం భారీగా పెరిగిందని అన్నారు. అప్పుడు బంగారం ఆశపెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడటం లేదని విమర్శించారు.

కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులపై తిట్ల వర్షం కురిపించడం తప్ప రేవంత్ రెడ్డికి తెలిసిందేమీ లేదని అన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్‌లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. ఎన్నికల తర్వాత రైతు బంధు ఇస్తామని ముఖ్యమంత్రి అంటున్నారని, కానీ ఈ నెల 11 లోపు ఇవ్వకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే అభివృద్ధి విషయంలో కేసీఆర్‌తో పోటీ పడాలని సవాల్ చేశారు.
Go Back to Shorts
KCR
K Chandrasekhar Rao
Harish Rao
BRS
Telangana
Gajwel
Revanth Reddy
Municipal Elections

More Telugu News