KCR: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు

KCR Revanth Reddy Remarks Draw Strong Reaction from Harish Rao
  • కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తన అక్కసు వెళ్లగక్కారన్న హరీశ్ రావు
  • హేట్ స్పీచ్ గురించి ముఖ్యమంత్రి ప్రసంగాలు వింటే చాలని విమర్శ
  • కేసీఆర్ రాష్ట్రానికి జాతిపితనే అని వ్యాఖ్య
మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన అజీర్తిని, అక్కసును వెళ్లగక్కారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. హార్వర్డ్‌లో చదువుకున్న ముఖ్యమంత్రి తన గుణం మాత్రం మార్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. హేట్ స్పీచ్ గురించి పుస్తకాలు అక్కరలేదని, ముఖ్యమంత్రి ప్రసంగాలు వింటే చాలని విమర్శించారు.

రావి నారాయణ రెడ్డి పురస్కార ప్రదాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేతపై విమర్శలు గుప్పించారు. ఈ మధ్య కొంతమంది వాళ్లకు వాళ్లే జాతిపిత అని టైటిల్ ఇచ్చుకుంటున్నారని, తమకు తామే ఉద్యమకారుడు అని రాసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని హరీశ్ రావు ప్రశ్నించారు. దేశానికి మహాత్మా గాంధీ జాతిపిత అయినట్లే తెలంగాణ సాధించిన కేసీఆర్ కూడా ఈ రాష్ట్రానికి జాతిపితనే అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న నాయకులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు లేదని హరీశ్ రావు అన్నారు.
KCR
Revanth Reddy
Harish Rao
BRS
Telangana
Telangana Jathipitha
Ravi Narayana Reddy
Hate Speech

More Telugu News