Aligarh Muslim University: అలీఘర్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో స్కూల్ టీచర్ దారుణ హత్య

Teacher shot dead on Aligarh Muslim University campus police probe underway
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) క్యాంపస్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాల ఉపాధ్యాయుడిని గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటనతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

మృతుడిని ఏఎంయూ మాజీ విద్యార్థి, క్యాంపస్‌లోని ఏబీకే హైస్కూల్‌లో గత 11 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రావ్ డానిశ్‌ (43)గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం బుధవారం రాత్రి 8:50 గంటల సమయంలో డానిశ్‌ తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి క్యాంపస్‌లో సాయంత్రం వాకింగ్‌కు వెళ్లారు. మౌలానా ఆజాద్ లైబ్రరీ సమీపంలోని క్యాంటీన్ వద్దకు చేరుకోగానే, స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు ముసుగు దుండగులు వారిని అడ్డగించారు.

తుపాకీతో బెదిరించి, రావ్ డానిశ్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తలలో రెండుసార్లు సహా మొత్తం మూడుసార్లు కాల్చడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

"రాత్రి 9 గంటల ప్రాంతంలో లైబ్రరీ దగ్గర కాల్పులు జరిగాయని, గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్నారని మాకు సమాచారం అందింది. బాధితుడు ఏబీకే స్కూల్ టీచర్ డానిష్ అని తెలిసింది. తలలో బుల్లెట్ గాయాలతో ఆయన మరణించారు" అని ఏఎంయూ ప్రాక్టర్ మొహద్ వసీం అలీ మీడియాకు తెలిపారు.

ఘటన గురించి తెలియగానే యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ నయీమా ఖాతూన్, ఇతర ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఎస్ఎస్‌పీ నీరజ్ జదౌన్ నేతృత్వంలోని పోలీసు బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను గుర్తించేందుకు క్యాంపస్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను ప‌రిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే కేసును ఛేదిస్తామని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Aligarh Muslim University
Teacher
shot dead
Crime

More Telugu News