Akhilesh Yadav: ల‌క్నోలో భారత్-ద‌క్షిణాఫ్రికా మ్యాచ్ ర‌ద్దుకు కార‌ణ‌మిదే: అఖిలేశ్ యాద‌వ్‌

Akhilesh Yadav Slams BJP After India South Africa Match Cancelled
షార్ట్స్‌లో చూడండి
తీవ్రమైన వాయు కాలుష్యం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. లక్నోలోని ఏకానా స్టేడియం దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉండటంతో కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ పరిణామంపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ స్పందిస్తూ, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా అఖిలేశ్‌ యాదవ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. "ఢిల్లీ కాలుష్యం ఇప్పుడు లక్నోకు కూడా పాకింది. ఇది సాధారణ మంచు కాదు, ప్రాణాంతకమైన పొగమంచు. అందుకే ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్ జరగడం లేదు" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం తీవ్రత కారణంగానే మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పర్యావరణాన్ని గాలికొదిలేసిందని అఖిలేశ్‌ విమర్శించారు. "స్వచ్ఛమైన గాలి కోసం ఏర్పాటు చేసిన పార్కులలో అనవసరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇస్తూ వాటిని నాశనం చేస్తున్నారు. బీజేపీకి ప్రజల ఆరోగ్యంపైనా, పర్యావరణంపైనా ఏమాత్రం ప‌ట్టింపు లేదు" అని ఆయన ఆరోపించారు. నగరవాసులు బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్కులు ధరించాలని ఆయన సూచించారు.

కాగా, ఏకానా స్టేడియంలో పొగమంచు కారణంగా క్రీడాకారులకు మైదానం స్పష్టంగా కనిపించలేదు. దీంతో టాస్‌ను పలుమార్లు వాయిదా వేసిన అంపైర్లు, చివరికి పరిస్థితిని సమీక్షించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Go Back to Shorts
Akhilesh Yadav
Lucknow
India vs South Africa
T20 Match
Air Pollution
Ekana Stadium
Uttar Pradesh
BJP Government
Smog

More Telugu News