KTR: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు... స్పీకర్ తీర్పుపై కేటీఆర్ ఫైర్

KTR Fires on Speakers Decision on MLA Defection Petitions
షార్ట్స్‌లో చూడండి
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైన, దేశ అత్యున్నత న్యాయస్థానాలపైన ఏమాత్రం గౌరవం లేదని ఈ ఘటనతో మరోసారి రుజువైందని కేటీఆర్ అన్నారు. కేవలం రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఫొటోలకు ఫోజులిస్తే సరిపోదని ఎద్దేవా చేశారు. తన తండ్రి రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గౌరవించడంలో విఫలమైన అసమర్థ నేతగా రాహుల్ గాంధీ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. అభివృద్ధి కోసమే పార్టీ మారామని చెబుతున్న ఎమ్మెల్యేలను కాపాడటం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

కేవలం ఉప ఎన్నికలకు భయపడే కాంగ్రెస్ పార్టీ, ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, త్వరలో పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ భయపడుతోందని తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ జాప్యం వెనుక ఉన్న భయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే స్పీకర్ ఫిరాయింపుల పిటిషన్లకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తిని విస్మరించి, స్థానిక కాంగ్రెస్ నాయకత్వం ఒత్తిడికి స్పీకర్ తలొగ్గడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడుకోవచ్చని, కానీ వారి నియోజకవర్గాల్లోని ప్రజలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలో వారిపై అనర్హత వేటు వేశారని కేటీఆర్ పేర్కొన్నారు.
Go Back to Shorts
KTR
KTR BRS
Telangana politics
Speaker decision
Congress party
MLA defections
Anti-defection law
Revanth Reddy
Telangana Assembly
Rahul Gandhi

More Telugu News