Lionel Messi: హైదరాబాద్ చేరుకున్న మెస్సీ.. కోల్‌కతా ఎఫెక్ట్ నేపథ్యంలో ఉప్పల్‌లో భారీ బందోబస్తు

Lionel Messi Arrives in Hyderabad Amid Tight Security After Kolkata Incident
షార్ట్స్‌లో చూడండి
ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. మెస్సీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నగరానికి విచ్చేశాడు. మరికాసేపట్లో రోడ్డు మార్గం ద్వారా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకోనున్నాడు. ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, మెస్సీతో 'మీట్ అండ్ గ్రీట్' సెషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెస్సీని కలిసేందుకు 100 మందికి అవకాశం కల్పించారు. వారికి ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను జారీ చేశారు.

మెస్సీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియం నుంచి మెస్సీ త్వరగా వెళ్లిపోవడంపై ఆగ్రహించిన అభిమానులు కుర్చీలు, నీళ్ల బాటిళ్లు విసిరి నిరసన తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనున్న ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 3 వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. మ్యాచ్‌ టిక్కెట్ ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోనికి అనుమతించనున్నారు. వాహనాల పార్కింగ్ కోసం 34 ప్రదేశాలలో ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్టేడియం, దాని పరిసర ప్రాంతాలను సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.

షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.50 గంటలకు ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
రాత్రి 8.05 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేడియానికి విచ్చేస్తారు. రాత్రి 8.06 గంటలకు మెస్సీ మైదానంలోకి ప్రవేశిస్తారు.
రాత్రి 8.08 గంటలకు రోడ్రిగో, లూయిస్ సువారెజ్ మైదానంలోకి వస్తారు.
రాత్రి 8.13 గంటలకు పెనాల్టీ షూటౌట్ ఉంటుంది.
రాత్రి 8.18 గంటలకు రాహుల్ గాంధీ మైదానంలోకి వస్తారు.
Go Back to Shorts
Lionel Messi
Messi Hyderabad
Faluknama Palace
Uppal Stadium
Hyderabad Police

More Telugu News