ఈశ్వర్ మరణానికి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కారణం: కేటీఆర్ ఆరోపణ
- బీసీ రిజర్వేషన్ల పేరిట రేవంత్ రెడ్డి దారుణ మోసం చేశారన్న కేటీఆర్
- బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీకు కాంగ్రెస్ తూట్లు పొడిచిందని విమర్శ
- శ్రీసాయి ఈశ్వర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్
స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తట్టుకోలేక శ్రీసాయి ఈశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కేవలం 17 శాతానికి కుదించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే అని ఆయన విమర్శించారు. కులగణన మొదలు న్యాయస్థానాల్లో నిలబడని జీవోల వరకు కాంగ్రెస్ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్కు సమాధి కట్టిందని కేటీఆర్ అన్నారు. శ్రీసాయి ఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.