అందుకే మోదీ మాటను ప్రపంచ నేతలు వింటున్నారు: ఆర్ఎస్ఎస్ చీఫ్
- భారత్ బలం పెరగడం వల్లే మోదీ మాటను శ్రద్ధగా వింటున్నారన్న భగవత్
- ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు
- సమాజాన్ని ఏకం చేసే పనిలో ఆలస్యంపై ఆత్మపరిశీలన అవసరమని వ్యాఖ్య
పూణెలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు. భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తే ప్రపంచ సమస్యలు పరిష్కారమవుతాయని, ఘర్షణలు తగ్గి శాంతి నెలకొంటుందని విశ్వాసం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు కూడా భారత్ నుంచి ఇదే ఆశిస్తున్నాయని ఆయన తెలిపారు.
సంఘ్ స్థాపించి వందేళ్లు పూర్తయినప్పటికీ, సమాజాన్ని ఏకం చేసే పనిలో ఇంత జాప్యం ఎందుకు జరిగిందనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, తొలితరం కార్యకర్తల త్యాగాల వల్లే సంఘ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుందని గుర్తుచేశారు.
తాము ఆలస్యంగా రాలేదని, తమ మాట వినడం మీరే ఆలస్యం చేశారని ఒక సందర్భంలో తాను చెప్పినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. "వైవిధ్యంలో ఏకత్వమే మన పునాది. ధర్మం ఆధారంగా మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి" అని ఆయన పిలుపునిచ్చారు.