భారత్ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు
- దేశంలో విస్తరిస్తున్న డయాబెటిస్ మహమ్మారి
- ఫార్మ్ఈజీ నివేదికలో వెల్లడైన కీలక గణాంకాలు
- యువతలోనూ ప్రమాదకరంగా పెరుగుతున్న డయాబెటిస్
- దక్షిణాది, తీర ప్రాంత రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదు
- డయాబెటిస్తో కిడ్నీ, లివర్ సమస్యలు ముడిపడి ఉన్నాయని వెల్లడి
- జీవనశైలి మార్పులతో నియంత్రణ సాధ్యమని నిపుణుల సూచన
ఈ విశ్లేషణ ప్రకారం, HbA1c పరీక్ష చేయించుకున్న వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు డయాబెటిస్ బారిన పడగా, ప్రతి నలుగురిలో ఒకరికి ప్రీడయాబెటిస్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. ఒకప్పుడు వృద్ధుల వ్యాధిగా పరిగణించిన డయాబెటిస్, ఇప్పుడు యువతను కూడా వేధిస్తోంది. 30 ఏళ్లలోపు వారిలోనూ అధిక రక్తంలో చక్కెర స్థాయిలు కనిపిస్తుండగా, 30 ఏళ్లు దాటిన తర్వాత ఈ ముప్పు గణనీయంగా పెరుగుతోందని నివేదిక హెచ్చరించింది. 60 ఏళ్లు పైబడిన వారిలో అయితే, ప్రతి 10 మందిలో 8 మంది డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్తో బాధపడుతున్నారు.
పురుషుల్లో (51.9 శాతం) మహిళలల్లో (45.43 శాతం) కంటే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా పుదుచ్చేరి (63 శాతం), ఒడిశా (61 శాతం), తమిళనాడు (56 శాతం) వంటి దక్షిణాది, తీర ప్రాంత రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదయ్యాయి. డయాబెటిస్ కేవలం రక్తంలో చక్కెర స్థాయిలకే పరిమితం కాదని, ఇది ఇతర అవయవాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని నివేదిక స్పష్టం చేసింది. డయాబెటిస్ ఉన్నవారిలో ప్రతి ముగ్గురిలో ఒకరికి కాలేయ సమస్యలు, దాదాపు సగం మందికి కిడ్నీ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
అయితే, సరైన జీవనశైలి, మందులతో దీన్ని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరు నెలల్లోపు మళ్లీ పరీక్షలు చేయించుకున్న వారిలో 22 శాతం మంది సాధారణ స్థాయికి రావడం ఇందుకు నిదర్శనం. ప్రజలు అప్రమత్తంగా ఉండి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.