Anand Mahindra: ఆ రోజు నా తల్లి సహా మహిళలంతా బంగారం తీసిచ్చారు: 1962 నాటి విషయాన్ని గుర్తు చేసుకున్న ఆనంద్ మహీంద్రా

Anand Mahindra recalls women donating gold during 1962 war
  • 10 దేశాల్లోని బంగారం కంటే భారతీయ మహిళలు అధిక బంగారం కలిగి ఉన్నారన్న నెటిజన్
  • తన చిన్ననాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్న ఆనంద్ మహీంద్రా
  • చైనాతో యుద్ధం సమయంలో మహిళలు బంగారం తీసి దాతృత్వాన్ని చాటుకున్నారన్న ఆనంద్ 
1962లో చైనాతో జరిగిన యుద్ధ సమయంలో దేశానికి అండగా నిలిచేందుకు భారతీయ మహిళలు తమ బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా తెలియజేశారు. 10 దేశాల్లోని మహిళల కంటే భారతీయ మహిళలు సమష్టిగా ఎక్కువ బంగారాన్ని కలిగి ఉన్నారనే ఒక ట్వీట్‌కు స్పందిస్తూ ఆనంద్ మహీంద్రా తన చిన్ననాటి అనుభవాన్ని పంచుకున్నారు.

భారత ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు బంగారంపై మక్కువ ఎక్కువని, వారి వద్ద 24 వేల నుంచి 25 వేల టన్నుల బంగారం ఉంటుందని, ఇది అమెరికా, జర్మనీ వంటి దేశాల వద్ద ఉన్న బంగారం కంటే చాలా ఎక్కువని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. అమెరికాలో 8,133 టన్నులు, జర్మనీలో 3,351 టన్నులు, ఇటలీలో 2,451 టన్నులు, ఫ్రాన్స్‌లో 2,437 టన్నులు, రష్యాలో 2,332 టన్నులు, చైనాలో 2,279 టన్నులు, స్విట్జర్లాండ్‌లో 1,039 టన్నులు, జపాన్‌లో 845 టన్నులు, నెదర్లాండ్స్‌లో 612 టన్నులు, పోలాండ్‌లో 448 టన్నుల బంగారం ఉండగా, భారతీయ మహిళల వద్ద 25,488 టన్నుల బంగారం ఉందని ఆయన వివరించాడు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు.

ఈ ఆకర్షణీయమైన గణాంకాలపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, ఇవి ఆరు దశాబ్దాల కిందట దేశ ప్రజల యొక్క సాటిలేని దాతృత్వాన్ని గుర్తు చేస్తున్నాయని అన్నారు. 1962లో చైనా యుద్ధం సమయంలో నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిఫెన్స్ ఫండ్‌ను ఏర్పాటు చేసి, దేశ రక్షణ చర్యల కోసం బంగారం, ఆభరణాలు విరాళంగా ఇవ్వాలని పౌరులను కోరిందని ఆయన గుర్తు చేశారు. అప్పటి ధరల ప్రకారం వేల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని సేకరించినట్లు ఆయన తెలిపారు. ఒక్క పంజాబ్ నుంచే 252 కిలోల బంగారం విరాళంగా అందిందని ఆయన పేర్కొన్నారు.

అప్పుడు తన వయస్సు ఏడేళ్లని, ప్రజలు విరాళాలు ఇవ్వాలని కోరుతూ కొన్ని ప్రభుత్వ ట్రక్కులు ముంబై వీధుల్లో తిరుగుతుండగా చూశానని ఆయన తెలిపారు. ఆ సమయంలో తాను తన తల్లితో కలిసి బయట నిలబడి ఉండగా, ఆ పిలుపు విన్న తన తల్లి బంగారు గాజులు, హారాలను ఒక గుడ్డలో చుట్టి ట్రక్కులోని వాలంటీర్లకు అందజేసిందని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎంతో నిశ్శబ్దంగా తనకున్నంతలో దాతృత్వాన్ని చాటుకుందని ఆయన అన్నారు.

దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం విధానపరమైన చర్యలపైనే కాకుండా ప్రజల సమష్టి సంకల్పంపై కూడా ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆనాటి సంఘటన ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. ఈ విరాళాలు దేశభక్తిని చాటుకోవడమే కాకుండా, దేశ ప్రజల ఐక్యత, విశ్వాసానికి చిహ్నమని ఆయన అభివర్ణించారు.
Anand Mahindra
1962 Sino Indian War
Gold donations India
Indian women gold
National Defence Fund

More Telugu News