భారత సైనిక స్థావరాలే లక్ష్యమా?.. పాక్ ఫతా-4 క్షిపణి ప్రయోగం విజయవంతం
- ఫతా-4ను సొంతంగా అభివృద్ధి చేసినట్లు ప్రకటించిన పాక్ సైన్యం
- 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం
- శత్రు రాడార్లను తప్పించుకోగల అత్యాధునిక టెక్నాలజీ
- భారత సైనిక స్థావరాలకు ముప్పుగా మారనున్న కొత్త క్షిపణి
- కేవలం 4 మీటర్ల కచ్చితత్వంతో లక్ష్యాలను తాకగల ఫతా-4
పాకిస్థాన్ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలను ఒక ప్రకటనలో తెలిపింది. ఫతా-4 క్షిపణి తమ సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సామర్థ్యాన్ని, పరిధిని మరింత పెంచుతుందని పేర్కొంది. ఈ క్షిపణి ప్రయోగ సమయంలో పాకిస్థాన్ సాయుధ దళాలకు చెందిన సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు హాజరయ్యారు.
ఫతా-4 ప్రత్యేకతలు ఏంటి?
ఫతా-4 క్షిపణిని వ్యూహాత్మకంగా కీలకమైన సుదూర లక్ష్యాలను ఛేదించేందుకు పాకిస్థాన్ రూపొందించింది. ఇది ప్రయాణ సమయంలో గంటకు 865 కిలోమీటర్ల వేగాన్ని (మాక్ 0.7) అందుకోగలదు. ఈ క్షిపణి ముఖ్యమైన సామర్థ్యం దాని కచ్చితత్వం. కేవలం 4 మీటర్ల వ్యత్యాసంతో (సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ) లక్ష్యాన్ని తాకగలదని పాక్ సైన్యం తెలిపింది.
అంతేకాకుండా, శత్రువుల రాడార్ కళ్లకు చిక్కకుండా భూమికి అతి సమీపంగా ప్రయాణించే టెక్నాలజీ దీని సొంతం. ఈ లక్షణం వల్ల శత్రు క్షిపణి రక్షణ వ్యవస్థలను సైతం ఇది సులభంగా ఛేదించగలదని పాక్ వర్గాలు వివరించాయి. ఈ క్షిపణి 7.5 మీటర్ల పొడవు, 1530 కిలోల బరువుతో పాటు 330 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలదు. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలు, ఎయిర్బేస్లు, ఇతర కీలక ప్రాంతాలకు ఈ క్షిపణి ముప్పుగా మారే అవకాశం ఉంది.