విజయ్కి కమల్ హాసన్ పాఠం: సభలకు వచ్చిన జనమంతా ఓట్లు వేయరు!
- సభలకు వస్తున్న జనాలను చూసి మురిసిపోవద్దన్న కమల్
- ఈ సూత్రం విజయ్తో పాటు తనకూ వర్తిస్తుందన్న కమల్
- ధైర్యంగా ప్రజలకు సేవ చేయాలంటూ విజయ్కు సలహా
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు భారీగా జనం తరలివస్తున్నారు. ఈ విషయంపై చెన్నైలో విలేకరులు అడిగిన ప్రశ్నకు కమల్ హాసన్ బదులిచ్చారు. "సభలకు వచ్చే జనాన్ని చూసి భ్రమ పడకూడదు. ఆ జనమంతా ఓట్లు వేస్తారనే గ్యారెంటీ లేదు. ఇది విజయ్కు మినహాయింపు కాదు. నాతో సహా అందరి విషయంలోనూ ఇది నిజం" అని ఆయన వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన విజయ్కు ఎలాంటి సలహా ఇస్తారని అడగ్గా, "ధైర్యంగా మంచి మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను. ఈ విజ్ఞప్తి అందరు నాయకులకూ వర్తిస్తుంది" అని కమల్ తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు సహజమని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పరోక్షంగా సూచించారు.
కాగా, రెండు రోజుల క్రితం తిరువారూర్లో జరిగిన ఓ సభలో విజయ్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. "సభకు ఇంతమంది వస్తున్నారు కానీ, వీళ్లంతా ఓట్లు వేయరని అంటున్నారు. అది నిజమేనా?" అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. దీనికి అక్కడున్న జనం ‘విజయ్.. విజయ్’ అని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ మద్దతు ఆయనకేనని సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.