Narendra Modi: నన్ను తిట్టినా భరిస్తాను... కానీ...!: ప్రధాని మోదీ

Narendra Modi Says He Can Tolerate Insults But Not Disrespect to Northeast
షార్ట్స్‌లో చూడండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రముఖ గాయకుడు, భారతరత్న భూపేన్ హజారికాను కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని, ఈశాన్య రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ఆదివారం అసోంలోని దర్రాంగ్ జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, "భూపేన్ హజారికాకు భారతరత్న ప్రకటించిన రోజు, 'పాటలు పాడేవారికి, డ్యాన్సులు చేసేవారికా మోదీ భారతరత్న ఇచ్చేది?' అని నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి" అని తెలిపారు. తనను ఎవరైనా దూషించినా తాను శివుడిలా విషాన్ని దిగమింగుతానని, కానీ ఈశాన్య ప్రజలు ఆరాధించే వ్యక్తిని అవమానిస్తే మాత్రం సహించలేనని ఆయన భావోద్వేగంగా అన్నారు.

అంతకుముందు, మంగళ్‌దోయ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కొత్త మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, జీఎన్ఎం స్కూల్, బీఎస్సీ నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు గువాహటిలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఉద్దేశించిన రింగ్ రోడ్డు ప్రాజెక్టు, బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న కురువ-నారెంగి వంతెన పనులను కూడా ప్రారంభించారు.

భూపేన్ హజారికా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు శనివారమే అసోంకు వచ్చినట్లు ప్రధాని గుర్తుచేశారు. ఈ పర్యటనలో భాగంగా, గోలాఘాట్ జిల్లాలోని నుమాలిగఢ్‌లో ఏర్పాటు చేసిన బయో-ఇథనాల్ ప్లాంట్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. అలాగే, నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో పాలీప్రొఫైలిన్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగడంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
Go Back to Shorts
Narendra Modi
PM Modi
Bhupen Hazarika
Assam
Congress
Northeast India
Development Projects
Bharat Ratna
Guwahati
Numaligarh

More Telugu News