Toll Fee for Two Wheelers: టూవీలర్లకు టోల్ ఫీజు లేదు.. ఆ వార్తలు నమ్మొద్దు: కేంద్రం క్లారిటీ

No user fee collection from two wheelers at toll plazas says Govt
  • టూవీలర్లకు టోల్ ఫీజుపై కేంద్రం స్పష్టత
  • సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నకిలీవని వెల్లడి
  • జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ మినహాయింపు
  • నిబంధనల ప్రకారం నాలుగు చక్రాల వాహనాలకే టోల్ రుసుము
  • ఫాస్టాగ్ వార్షిక పాసుల అమ్మకాలతో ఎన్‌హెచ్‌ఏఐకి భారీ ఆదాయం
  • పాసుల లావాదేవీల్లో ఏపీకి మూడో స్థానం
జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ద్విచక్ర వాహనాలకు (టూవీలర్లకు) టోల్ ఫీజు వసూలు చేయబోరని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కొంతకాలంగా దీనిపై జరుగుతున్న ప్రచారాన్ని నకిలీ వార్తగా కొట్టిపారేసింది. టూవీలర్ల నుంచి కూడా టోల్ రుసుము వసూలు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది.

ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. "దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ద్విచక్ర వాహనాల నుంచి ఎలాంటి యూజర్ ఫీజు వసూలు చేయడం లేదు. ఈ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు" అని ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ రహదారుల ఫీజు (నిర్ణయం, సేకరణ) నిబంధనలు-2008 ప్రకారమే టోల్ వసూళ్లు జరుగుతున్నాయని, ఈ నిబంధనలను మార్చే ప్రతిపాదన ఏదీ లేదని వెల్లడించింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు వర్తిస్తుంది. కారు, జీపు, వ్యాన్, తేలికపాటి వాణిజ్య వాహనం, బస్సు, ట్రక్కు, భారీ నిర్మాణ యంత్రాలు, మల్టీ యాక్సిల్ వాహనాల వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ పాసుల అమ్మకాలు
ఇదే సమయంలో ఎన్‌హెచ్‌ఏఐ కేవలం నాలుగు రోజుల్లోనే 5 లక్షలకు పైగా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక టోల్ పాసులను విక్రయించినట్లు తెలిపింది. ఈ అమ్మకాల ద్వారా రూ. 150 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించింది. ప్రైవేట్ వాహనాల కోసం ఉద్దేశించిన ఈ వార్షిక పాసు ధరను రూ. 3,000గా నిర్ణయించారు. ఈ పాసు కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 టోల్ ప్రయాణాల వరకు చెల్లుబాటు అవుతుంది. వీటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది.

వార్షిక పాసులను అత్యధికంగా కొనుగోలు చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక, హర్యానా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ పాసుల ద్వారా అత్యధిక లావాదేవీలు జరిపిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ తన ప్రకటనలో పేర్కొంది.
Toll Fee for Two Wheelers
NHAI
National Highways Authority of India
toll tax
toll fee
two wheelers
Fastag
Tamil Nadu
Karnataka
Andhra Pradesh

More Telugu News