Narendra Modi: గల్వాన్ ఘర్షణ తర్వాత మొదటిసారిగా... ఈ నెలాఖరులో చైనా పర్యటనకు ప్రధాని మోదీ

Narendra Modi to Visit China for SCO Summit After Galwan Clash
షార్ట్స్‌లో చూడండి
భారత్, చైనా సంబంధాలలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్వాన్ లోయ ఘర్షణల అనంతరం తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. చైనాలోని తియాంజిన్ నగరంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్లనున్నారు. 2020లో గల్వాన్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గత నాలుగేళ్లుగా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న సైనిక ప్రతిష్టంభనకు తెరదించుతూ, సుమారు 3500 కిలోమీటర్ల సరిహద్దులో గస్తీ నిర్వహణపై ఇరు దేశాలు ఇటీవల ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం తర్వాత ద్వైపాక్షిక చర్చల్లో కీలక పురోగతి లభించింది. ఈ సానుకూల వాతావరణంలోనే ప్రధాని పర్యటన ఖరారైంది. చివరిసారిగా ప్రధాని మోదీ 2019లో చైనాలో పర్యటించారు. ఆ తర్వాత 2024లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు.

ప్రధాని పర్యటనకు ముందు, గత రెండు నెలలుగా భారత ఉన్నత స్థాయి ప్రతినిధులు చైనాలో పర్యటించారు. జూలైలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎస్సీవో విదేశాంగ మంత్రుల సమావేశం కోసం తియాంజిన్ వెళ్లి, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో చర్చలు జరిపారు. జూన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా వేర్వేరు ఎస్సీవో సమావేశాల కోసం చైనాను సందర్శించారు.

ఈ పర్యటనల సందర్భంగా భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. ఉగ్రవాదంపై ఆందోళనలను చేర్చలేదన్న కారణంతో ఎస్సీవో రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనను భారత్ అంగీకరించలేదు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని విడనాడాలని, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అజిత్ డోభాల్ ఎస్సీవో వేదికగా గట్టిగా డిమాండ్ చేశారు. ఈ పరిణామాల తర్వాత జరుగుతున్న ప్రధాని మోదీ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
Go Back to Shorts
Narendra Modi
China visit
SCO summit
Galwan clash
India China relations
Xi Jinping
S Jaishankar
Ajit Doval
LAC standoff
Terrorism

More Telugu News