Rahul Gandhi: అమిత్ షా పరువునష్టం కేసు.. రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు

Rahul Gandhi appears before Chaibasa court in Amit Shah defamation case granted bail
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దాఖలైన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం ఝార్ఖండ్‌లోని చాయ్‌బాసా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు ఆయన హాజరయ్యారు. రాహుల్ గాంధీ హాజరు అనంతరం న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

2018లో చాయ్‌బాసాలో జరిగిన ఓ బహిరంగ సభలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి ఈ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం, రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి జూన్ 26న హాజరు కావాల్సి ఉండగా, ఇతర కార్యక్రమాల కారణంగా తేదీని మార్చాలని రాహుల్ తరఫు న్యాయవాది ఝార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో ఆగస్టు 6న హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది.

కోర్టు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ ఈరోజు విచారణకు హాజరయ్యారు. కాగా, ఝార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ ఇప్పటికే రాష్ట్రానికి వచ్చారు. అంత్యక్రియల అనంతరం ఆయన రాంచీ నుంచి హెలికాప్టర్‌లో చాయ్‌బాసాకు చేరుకున్నారు. రాహుల్ రాక నేపథ్యంలో అధికారులు టాటా కాలేజ్ గ్రౌండ్‌లో ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేసి, కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బెయిల్ మంజూరు కావడంతో ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగనుంది.
Go Back to Shorts
Rahul Gandhi
Amit Shah
Defamation case
Jharkhand
ChaiBasa
MP MLA Court
Bail granted
Congress leader
BJP
Pratap Kumar

More Telugu News