అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. 8 మంది మృతి
- మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తా
- రాజంపేట నుంచి రైల్వేకోడూరుకు మార్కెట్కు వెళ్తుండగా బోల్తా పడిన వైనం
- ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 18 మంది కూలీలు
- లారీలో చిక్కుకున్న 9 మందిని రక్షించిన పోలీసులు
- క్షతగాత్రులు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో లారీలో 18 మంది కూలీలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో చిక్కుకున్న 9 మందిని రక్షించి వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి జనార్థనరెడ్డి స్పందించారు. జిల్లా అధికారులకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతులంతా కూలీలు కావడం బాధాకరమని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.