ట్రంప్ కొత్త బిల్లు ఎఫెక్ట్.. భారతీయ విద్యార్థులకు, టూరిస్టులకు అమెరికా షాక్!
- నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాల ఫీజును పెంచిన ట్రంప్ ప్రభుత్వం
- రూ. 16 వేల నుండి రూ. 40 వేలకు పెరిగిన టూరిస్ట్ వీసా ఫీజు
- యూఎస్ వీసా ఇంటిగ్రిటీ ఫీజు కింద 250 అమెరికన్ డాలర్లు చెల్లించాలి
యూఎస్ వీసా ఇంటిగ్రిటీ ఫీజు కింద 250 అమెరికన్ డాలర్లను చెల్లించవలసి ఉంటుంది. అంటే రూ. 21,400 చెల్లించాలి. ఈ మొత్తాన్ని వెనక్కి ఇవ్వరు. దీనికి అదనంగా సర్ఛార్జీని వసూలు చేస్తారు. వీసా జారీ చేసే సమయంలో ఈ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది.
బీ1, బీ2 (టూరిస్ట్ అండ్ బిజినెస్ వీసాలు), ఎఫ్ అండ్ ఎం (విద్యార్థి వీసాలు), హెచ్1బీ (వర్క్ వీసా), జే (ఎక్స్చేంజ్ విజిటర్ వీసా) వీసాలకు ఈ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. డిప్లొమాటిక్ వీసా కలిగిన వారికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, పర్యాటకులు, వ్యాపారం కోసం ప్రయాణాలు చేసే వారిపై ఈ ఫీజుల ప్రభావం పడనుంది.
బీ2 టూరిస్ట్ వీసా ఖర్చు ప్రస్తుతం రూ. 15 వేలుగా ఉంటే, ఇప్పుడు అదనంగా ఇంటిగ్రిటీ ఫీజు కింద రూ. 21 వేలు చెల్లించవలసి ఉంటుంది. దీంతో మొత్తం ఖర్చు రూ.35 వేలు దాటుతుంది. హెచ్1బీ వీసా ధర ఇప్పటి వరకు స్వల్పంగా ఉంది. కానీ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ప్రకారం భారీగా పెరిగింది.
ఇదిలా ఉండగా, వీసా ఇంటిగ్రిటీ ఫీజును కొన్ని సందర్భాలలో వెనక్కి ఇస్తారు. వీసా హోల్డర్ అమెరికాలో ఉన్న సమయంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే తిరిగి ఇస్తారు. అలాగే ఐ-94 గడువు ముగియడానికి ఐదు రోజుల కంటే ముందుగా అమెరికాను విడిచి వెళ్లిన వారికి కూడా చెల్లిస్తారు.
ఈ వీసా ఫీజుల పెంపు 2026 సంవత్సరం నుంచి అమలులోకి రానుంది.