పాశమైలారం ప్రమాదం.. సిగాచి యాజమాన్యంపై కేసు నమోదు

Pasamailaram Fire Accident Case Filed Against Sigachi Management
  • 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడి
  • పాశమైలారం పేలుడు ఘటన స్థలాన్ని పరిశీలించిన కిషన్ రెడ్డి
  • కేంద్రం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ
పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదు మేరకు పరిశ్రమ యాజమాన్యం సిగాచిపై బీడీఎల్ భానూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా, మరికొంతమంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఉన్నతస్థాయి కమిటీ వేయాలి: కిషన్ రెడ్డి డిమాండ్

బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాశమైలారం పారిశ్రామికవాడ ప్రమాద స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు పలు మృతదేహాలను వెలికితీశారని, మరో 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోందని వివరించారు. పొట్టకూటి కోసం వలస వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో జరుగుతున్న తనిఖీలు కేవలం లంచాల కోసమా లేక నామమాత్రంగా సాగుతున్నాయా అనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఫార్మా కంపెనీలకు ముడిసరుకు అందించే ఈ సంస్థలో భద్రతా ప్రమాణాల లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గతంలోనూ ఇలాంటి ప్రమాదంలో 11 మంది చనిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత వహించాల్సిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిగాచి యాజమాన్యానికి చెందిన మరో మూడు పరిశ్రమలు కూడా ఉన్నాయని, వాటిలోనూ తక్షణమే తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలను సమీక్షించాలని కోరారు. శిథిలాల కింద ఇంకా మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నందున, వాటిని గుర్తించేందుకు పోలీస్ జాగిలాలను వినియోగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పారిశ్రామిక ప్రాంతాల్లో తప్పనిసరిగా అంబులెన్స్ అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు తెలిసిన తర్వాత, వారి కుటుంబ సభ్యులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. మృతుల కుటుంబసభ్యులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటే, అందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామన్నారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయడం సరికాదని విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
Go Back to Shorts
Pasamailaram fire accident
Kishan Reddy
Sigachi
Telangana fire accident
Sangareddy fire

More Telugu News