Bandi Sanjay: పాశమైలారం ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి

Bandi Sanjay reacts to Pashamylaram fire accident
షార్ట్స్‌లో చూడండి
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన పేలుడు ఘటనపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామికవాడలో రియాక్టర్ పేలడంతో పలువురు మృతి చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్‌కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన తన సంతాపాన్ని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు.

పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని బండి సంజయ్ తన సందేశంలో పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అంది, వారు త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు బండి సంజయ్ వివరించారు.
Go Back to Shorts
Bandi Sanjay
Sangareddy fire accident
Pashamylaram industrial area
Telangana governor

More Telugu News