Anjali murder case: ప్రేమకు అడ్డొస్తుందని ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కన్న కూతురు

Anjali Murder Case Teenage Daughter Kills Mother in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన అంజలి హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లో ఛేదించారు. ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తోందన్న కారణంతో పదో తరగతి చదువుతున్న కుమార్తె, ఆమె ప్రియుడు, అతని సోదరుడితో కలిసి తల్లిని దారుణంగా హత్య చేసిందని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన బుధవారం బాలానగర్‌లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు.

డీసీపీ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు అంజలి (39) కుమార్తె (మైనర్) కొంతకాలంగా శివ (19) అనే యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. శివ డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడని, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బాలికకు పరిచయమయ్యాడని పోలీసులు తెలిపారు. వీరి ప్రేమ వ్యవహారాన్ని తల్లి అంజలి వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ క్రమంలో కొన్ని నెలలుగా తల్లికూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తన ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని భావించిన బాలిక, ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ నెల 19న బాలిక ఇంట్లోంచి వెళ్లిపోవడంతో, ఆందోళన చెందిన తల్లి అంజలి 20వ తేదీన జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు పెట్టారు. అయితే, బాలిక అదే రోజు (20వ తేదీ) రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం, ఈ నెల 23న షాపూర్‌నగర్‌లోని వారి ఇంట్లో అంజలి పూజ చేసుకుంటున్న సమయంలో, బాలిక తన ప్రియుడు శివ, అతని తమ్ముడితో కలిసి పథకం ప్రకారం దాడి చేసింది. చున్నీతో అంజలి గొంతు నులిమి, తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని డీసీపీ వివరించారు.

"ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తుందనే ఉద్దేశంతోనే తల్లిని హత్య చేసినట్లు నిందితురాలైన బాలిక విచారణలో అంగీకరించింది. ముగ్గురు నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి, వారిని రిమాండ్‌కు తరలించాం" అని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు.
Go Back to Shorts
Anjali murder case
Hyderabad crime
Jeedimetla police station
Minor girl murder

More Telugu News