'సంకరజాతి' అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఫైర్
- అమరావతి మహిళలపై సజ్జల వ్యాఖ్యలను ఖండించిన షర్మిల
- సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడారని తీవ్ర విమర్శ
- సొంత చెల్లికే జగన్ ప్రభుత్వంలో గౌరవం లేదంటూ వ్యాఖ్య
ఈ సందర్భంగా షర్మిల తనపై జరిగిన సోషల్ మీడియా దాడిని కూడా ప్రస్తావించారు. "సజ్జల కుమారుడు భార్గవ్రెడ్డి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని నాపై కూడా తీవ్రమైన దుష్ప్రచారం చేశారు. నేను వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెనని, ఒక మహిళనని కూడా చూడకుండా నన్ను కించపరిచారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అందరినీ తన అక్కాచెల్లెళ్లుగా సంబోధిస్తారని, కానీ ఆయన సొంత చెల్లికే కనీస మర్యాద దక్కడం లేదని విమర్శించారు. అలాంటప్పుడు రాష్ట్రంలోని ఇతర మహిళలను ఆయన ఎలా గౌరవిస్తారని షర్మిల ప్రశ్నించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతల తీరుపై కూడా షర్మిల తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఒక మహాసముద్రంతో పోల్చిన ఆమె, అందులో మంచి వ్యక్తులతో పాటు కొంత చెత్త కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు. "పార్టీ అభివృద్ధి పథంలో పయనిస్తుంటే, కొందరు దాన్ని కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. వారే పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు" అని అన్నారు. పార్టీలో క్రమశిక్షణా కమిటీ ఉందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సొంత పార్టీపైనే దుష్ప్రచారం చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని షర్మిల స్పష్టం చేశారు.