Mallikarjun Kharge: ఖర్గే వ్యాఖ్యలతో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది.. జేడీయూ ఘాటు విమర్శ

Mallikarjun Kharge Remarks Criticized by JDU
షార్ట్స్‌లో చూడండి
ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన నష్టానికి ఆధారాలు చూపాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన డిమాండ్‌పై జేడీయూ తీవ్రంగా స్పందించింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై ఇలాంటి రాజకీయ వైఖరి ప్రదర్శించడం వల్లే కాంగ్రెస్ పార్టీ క్రమంగా కుచించుకుపోతోందని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ విమర్శించారు. ఖర్గే వ్యాఖ్యలు దురదృష్టకరమని, రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు.

నేడు ఐఏఎన్ఎస్‌ వార్తా సంస్థతో నీరజ్ కుమార్ మాట్లాడుతూ "మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండటం ఆ పార్టీ దురదృష్టం. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత మన సాయుధ బలగాలు అసమాన ధైర్యసాహసాలతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. ఇది భారత్‌కు లభించిన దౌత్య విజయం. మన ఎంపీలు కూడా అంతర్జాతీయ పర్యటనల్లో పాకిస్థాన్ ఉగ్రవాద విధానాలను ప్రపంచ వేదికలపై ఎండగట్టారు" అని తెలిపారు.

అయితే, రాజకీయ అసూయతో కాంగ్రెస్ పార్టీ ఈ విజయాన్ని గుర్తించడం లేదని నీరజ్ కుమార్ ఆరోపించారు. "ఉగ్రవాదం విషయానికి వస్తే రాజకీయ విభేదాలకు తావుండకూడదు. ఇలాంటి బాధ్యతారహితమైన ప్రకటనల వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణలో వెనుకబడిపోతోంది" అని అన్నారు.

సింగపూర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఖర్గే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఆరోపణలు ‘పూర్తిగా అవాస్తవం’ అని జనరల్ చౌహాన్ ఈ సందర్భంగా తిప్పికొట్టారు. కార్గిల్ యుద్ధం అనంతరం చేపట్టిన సమీక్ష తరహాలో భారత రక్షణ సన్నద్ధతపై స్వతంత్ర సమీక్ష జరపాలని కూడా ఖర్గే కోరారు.

ఇదే సమయంలో, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఉద్దేశం గురించి అడిగిన ప్రశ్నకు నీరజ్ కుమార్ స్పందిస్తూ, ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఇది రాష్ట్రంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే)ను మరింత బలోపేతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. "చిరాగ్ పాశ్వాన్ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మంత్రి. ఆయన పార్టీ ఎన్డీయేలో భాగస్వామి. బీహార్‌లో ఎన్నికలు నితీశ్ కుమార్ నాయకత్వంలోనే జరుగుతాయని, ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చిరాగ్ బహిరంగంగానే చెప్పారు" అని కుమార్ గుర్తుచేశారు. ఎన్డీయే మిత్రపక్షానికి చెందిన ఏ నాయకుడైనా పోటీ చేయాలనుకుంటే, వారి పార్టీకి కేటాయించిన స్థానం నుంచి పోటీ చేస్తారని, ఇది బీహార్‌లో ఎన్డీయేను మరింత పటిష్టం చేస్తుందని ఆయన వివరించారు.
Go Back to Shorts
Mallikarjun Kharge
Congress
JDU
Neeraj Kumar
Operation Sindoor
Indian Politics
National Security
Bihar Elections
Chirag Paswan
NDA

More Telugu News