ప్రపంచానికి 'సిందూర్' ప్రాముఖ్యత తెలిసింది: అమిత్ షా
- ఆపరేషన్ సిందూర్తో ప్రపంచానికి భారతీయ సిందూరం ప్రాముఖ్యతను చాటామన్న అమిత్ షా
- పాక్ ఉగ్రస్థావరాలపై దాడులతో దేశం గర్వపడేలా చేశామని వ్యాఖ్య
- మోదీ వల్లే ఇది సాధ్యమైందని, శాంతికి భంగం కలిగించేవారు బాధతో మూలుగుతున్నారని వెల్లడి
దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూసిన శక్తులను వెనక్కి తరిమికొట్టామని, ఇప్పుడు వారు తమ చర్యలకు పశ్చాత్తాపంతో బాధపడుతున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పం, నిఘా వర్గాల కచ్చితమైన సమాచారం, త్రివిధ దళాల అద్భుతమైన సమన్వయం వల్లే 'ఆపరేషన్ సిందూర్' విజయవంతమైందని ఆయన గతంలోనూ పలుమార్లు స్పష్టం చేశారు.
ఈ ఆపరేషన్లో భాగంగా భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. వీటిలో రెండు ప్రధాన ఉగ్ర కార్యాలయాలు కూడా ఉన్నట్లు అమిత్ షా గతంలో తెలిపారు. అయితే, ఈ దాడుల్లో పాకిస్థానీ పౌరులకు గానీ, వారి సైనిక స్థావరాలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రభుత్వ, సైనిక వర్గాలు వెల్లడించాయి.