Telugu Film Industry: తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్...!

Telugu Theaters Shut Down from June 1st
షార్ట్స్‌లో చూడండి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సినిమా ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రస్తుతమున్న అద్దె (రెంటల్) పద్ధతిలో థియేటర్లను నడపడం తమకు సాధ్యం కావడం లేదని, కేవలం సినిమా వసూళ్లలో వాటా (పర్సంటేజీ) పద్ధతిని అమలు చేస్తేనే థియేటర్లను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

ఈ రోజు (ఆదివారం) హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, డి. సురేష్ బాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎగ్జిబిటర్లు తమ సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను నిర్మాతలకు వివరించినట్లు సమాచారం.

థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని, అద్దె పద్ధతి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. "అద్దె ప్రాతిపదికన థియేటర్లను ఇకపై నడిపించలేం. మాకు పర్సంటేజీ రూపంలోనే వాటా కావాలి. అప్పుడే మాకు గిట్టుబాటు అవుతుంది," అని వారు తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు తమ డిమాండ్లను, నిర్ణయాన్ని వివరిస్తూ నిర్మాతలకు అధికారికంగా ఒక లేఖ రాయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, జూన్ 1 నుంచి విడుదల కావాల్సిన పలు సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా చిత్రాల విడుదలకు ఇబ్బందులు తలెత్తవచ్చని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిబిటర్ల నిర్ణయంతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త చర్చ మొదలైంది. ఈ సమస్యకు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కలిసి ఎలాంటి పరిష్కారం కనుగొంటారో చూడాలి.
Go Back to Shorts
Telugu Film Industry
Andhra Pradesh
Telangana
Cinema Exhibitors
Theater Closure
Dil Raju
D. Suresh Babu
Film Producers
Rental System
Percentage Share

More Telugu News