అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థుల దుర్మరణం

Two Indian Students Killed in US Road Accident
అమెరికాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులు అకాల మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

పెన్సిల్వేనియాలో స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి తొలుత ఓ చెట్టును బలంగా ఢీకొట్టింది. ఆపై, వేగంగా దూసుకెళ్లి వంతెన పైనుంచి కిందకు పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారని అధికారులు తెలిపారు. ఇదే వాహనంలో ముందు సీటులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా గాయపడగా, అతడిని తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు.

మృతిచెందిన విద్యార్థులు క్లీవ్‌లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నారని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం ధృవీకరించింది. మృతులను మానవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్‌లుగా గుర్తించినట్లు కాన్సులేట్ అధికారులు వెల్లడించారు. ఈ హృదయవిదారక ఘటనపై భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలతో కాన్సులేట్ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిసింది. విద్యార్థుల ఆకస్మిక మరణవార్త వారి స్వస్థలాల్లోని కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నత భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన యువకులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కలచివేస్తోంది.
Go Back to Shorts
Manav Patel
Sourav Prabhakar
Indian Students
Car Accident
Pennsylvania
Cleveland State University
Tragic Death
US Road Accident
India Consulate General New York
Study Abroad

More Telugu News