పెళ్లైన సంతోషం కూడా లేకుండా నన్ను బాధపెడుతున్నారు: బర్రెలక్క
- సోషల్ మీడియా ట్రోల్స్పై బర్రెలక్క తీవ్ర ఆవేదన
- ముఖ్యంగా తన పెళ్లి గురించి ట్రోల్స్ చేస్తున్నారని కంటతడి
- ట్రోల్స్ భయంతోనే త్వరగా పెళ్లి చేసుకున్నానని వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తనపై నిరంతరంగా ట్రోల్స్ వస్తున్నాయని శిరీష వాపోయారు. ఇటీవల జరిగిన తన వివాహం గురించి కూడా అసభ్యకరంగా ట్రోల్స్ చేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. "నేను చేసిన తప్పేంటి? నన్ను ఎందుకు ఇంతలా వేధిస్తున్నారు?" అంటూ వీడియోలో ఆమె ప్రశ్నించారు. తనకు ముఖపరిచయం లేని వ్యక్తులు కూడా తన స్నేహితులమని చెప్పుకుని మోసాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే అందరూ ఇలాగే ట్రోల్స్ చేసి నా జీవితాన్ని నాశనం చేస్తారని నేను పెళ్లి చేసుకున్నాను. నిజానికి, పెళ్లి చేసుకోవాలని నాకు ఆసక్తి లేదు. ఒక సంవత్సరం ఆగుదాం అనుకున్నాం. కానీ, ఇంకా ఎన్ని రకాలుగా నిందిస్తారో అని భయపడి పెళ్లి చేసుకున్నాం. ఈ రోజు వరకు కూడా పెళ్లైన సంతోషం లేకుండా ట్రోల్స్ చేసి మానసికంగా నన్ను చాలా బాధపెడుతున్నారు. అన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు. నేను ఎవ్వరినీ ఏమీ అనను. కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు" అని శిరీష వాపోయారు.