అప్పుడు కెప్టెన్ ని... ఇప్పుడు కాదు... కానీ!: రోహిత్ శర్మ
- తాజా సీజన్ లో విఫలమవుతున్న రోహిత్ శర్మ
- జియోహాట్స్టార్లో ‘చర్చ విత్ రోహిత్ శర్మ కార్యక్రమం
- తొలి నుంచి తన దృక్పథంలో మార్పులేదన్న హిట్ మ్యాన్
ప్రస్తుతం రోహిత్ శర్మ తన కెరీర్ లోనే అత్యంత పేలవంగా ఆడుతున్నాడు. ఐపీఎల్ తాజా సీజన్ లో మొదటి మూడు మ్యాచ్లలోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ప్రారంభ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా విఫలమై 8 పరుగులు మాత్రమే చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ సబ్గా వచ్చి 13 పరుగులు చేశాడు.
జియోహాట్స్టార్లో ‘చర్చ విత్ రోహిత్ శర్మ’ ప్రత్యేక కార్యక్రమంలో రోహిత్ మాట్లాడుతూ.. "నేను ఒకప్పుడు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవాడిని. ఇప్పుడు ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. గతంలో నేను కెప్టెన్గా ఉండేవాడిని, ఇప్పుడు సాధారణ ఆటగాడిని మాత్రమే. గతంలో ముంబయి ఇండియన్స్ తరఫున ఛాంపియన్షిప్ గెలిచిన జట్టులోని కొంతమంది సహచరులు ఇప్పుడు కోచింగ్ పాత్రల్లో ఉన్నారు. పాత్రలు మారాయి, చాలా మార్పులు వచ్చాయి, కానీ నా మనస్తత్వం మాత్రం మారలేదు. ఈ జట్టు కోసం నేను ఏం చేయాలనుకుంటున్నానో ఆ దృక్పథం మారలేదు. ఎలాంటి అవకాశం లేదు అనుకున్న పరిస్థితుల్లోనూ మ్యాచ్ లు నెగ్గాం, ట్రోఫీలు గెలిచాం... ముంబయి ఇండియన్స్ అంటే అదే" అని స్పష్టం చేశాడు.