Chandrababu: అల్టిమేట్ గా మనందరినీ నడిపించే శక్తి భగవంతుడే: సీఎం చంద్రబాబు

Chandrababu speech at Maha Bhakti channel inauguration ceremony
షార్ట్స్‌లో చూడండి
మహా న్యూస్ వంశీకృష్ణ తమ గ్రూప్ నుంచి కొత్తగా మహా భక్తి చానల్ ను తీసుకువచ్చారు. ఈ చానల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు గుంటూరు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈ మహా భక్తి ఛానల్ ప్రజాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

"మహా న్యూస్ వంశీ గురించి నాకు తెలుసు. ఆంధ్రజ్యోతిలో చిన్న రిపోర్టర్ గా చేరిన వంశీ కృష్ణ... అక్కడ్నించి మహా న్యూస్ లోకి వచ్చాడు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ చానల్ పెట్టాడు. ఇవాళ మహా భక్తి ఛానల్ ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించాడు. అందుకు ఆయనను అందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. 

కొన్ని సార్లు చిన్న చిన్న వ్యక్తులే అసాధారణమైన శక్తులుగా తయారవుతారు. వంశీకృష్ణ కూడా అలాంటి వ్యక్తే. కృషి, పట్టుదల, తెలివితేటలతో వంశీకృష్ణ ఈ స్థాయికి ఎదిగారు. నాకు తెలిసినంతవరకు అతనికి భయం లేదు. నమ్మిన సిద్దాంతం కోసం గట్టిగా నిలబడతాడు. అనేక సవాళ్లను వీరోచితంగా ఎదుర్కొన్నారు. 

ఈ రోజుల్లో అందరికీ ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి, ఉద్యోగులకు బాధ్యతల ఒత్తిడి.... ఇలా టెన్షన్లు తట్టుకోలేకపోతుంటాం. అలాంటప్పుడు మనందరం దేవుడిపై భారం వేస్తుంటాం. దేవుడ్ని తలచుకుని ఒక మనో నిబ్బరంతో ముందుకు వెళుతుంటాం. ఈ ఆధునిక కాలంలో ఏఐ వంటి టెక్నాలజీలు వచ్చినా మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నాయి. మనశ్శాంతి కావాలంటే ఆధ్యాత్మికత వల్లే సాధ్యమవుతుంది. ఇప్పడు మహా న్యూస్ వంశీ మహా భక్తి ఛానల్ ద్వారా ఆధ్యాత్మికతను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ఆయనను అభినందిస్తున్నా. 

నేటి రోజుల్లో ఎన్నో ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలు కూడా ముందు దేవుడి దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి తమ ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. అల్టిమేట్ గా మనందరినీ నడిపించే శక్తి భగవంతుడే. అటువంటి భగవంతుడ్ని మనందరిలో ప్రేరేపించే వాతావరణం కల్పించడం కోసం ఇవాళ వంశీ మహా భక్తి ఛానల్ తీసుకువచ్చారు. రాబోయే రోజుల్లో ఈ చానల్ భక్తి భావలను వ్యాపింప చేస్తుందన్న నమ్మకం నాకుంది. 

ఇవాళ ఎన్డీయే ప్రభుత్వం దేవాలయాలపై శ్రద్ధ పెట్టింది. గత 8 నెలల కాలంలో ప్రతి ఒక్క దేవాలయంలో పవిత్రమైన వాతావరణంలో పూజలు చేయడమే కాకుండా, ఆలయాలన్నీ సమగ్రంగా పనిచేసేలా శ్రీకారం చుట్టాం. మన పిల్లలకు ఆధునిక పరిజ్ఞానం ఎంతో అవసరం... అదంతా సంపద సృష్టికి పనికొస్తుంది. కానీ మానసిక ఆనందానికి ఆధ్యాత్మిక చింతన అవసరం. 

నేను చాలా కార్యక్రమాలకు వెళ్లాను కానీ... ఈ కార్యక్రమానికి వచ్చాక ఎంతో ప్రశాంతతకు లోనయ్యాను. నా టెన్షన్లన్నీ మర్చిపోయి మళ్ళీ ఒక శక్తి తెచ్చుకుని ఇక్కడ్నించి వెళుతున్నాను. 

ఇవాళ మహా శివరాత్రి. శివుడ్ని కూడా నేను ఒకటే సంకల్పం అడిగాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పేదరికం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి... సంపద సృష్టించే పరిస్థితి రావాలి... 5.20 కోట్ల మందికి ఆనందం, ఆరోగ్యం ఇవ్వాలని... భారత దేశాన్ని సుసంపన్నం చేయాలని  ఆ శివుడ్ని ప్రార్థించాను. అంతకుమించి నాకు ఇంకేమీ కోరికలు లేవు. 

ఇవాళ నిరంజని అఖాడా మహామండలేశ్వర్ స్వామీ కైలాసానంద గిరి జీ మహారాజ్ సమక్షంలో రుద్రాభిషేకంలో పాల్గొనడం సంతోషం కలిగించింది. ప్రజల్లో ఆనందం కలిగించేందుకు భక్తి చానల్ పెట్టిన వంశీకి అన్ని విధాలుగా సహకరిస్తామని వంశీకి హామీ ఇస్తున్నా... ఓం నమశ్శివాయ" అంటూ చంద్రబాబు తన ప్రసంగం ముగించారు.
Go Back to Shorts
Chandrababu
Maha Bhakti Channel
Inauguration

More Telugu News