విమానం, హెలికాప్టర్ ఢీ.. నదిలో నుంచి 18 మృతదేహాల వెలికితీత
- అమెరికాలో ఘోర ప్రమాదం
- వైట్ హౌస్ కు దగ్గర్లో గాలిలో ఢీకొని నదిలో పడ్డ విమానం, హెలికాప్టర్
- ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది సహా 64 మంది ప్రయాణికులు
- ఆర్మీ హెలికాప్టర్ లో ముగ్గురు సైనికులు
ముక్కలై నదిలో పడ్డ విమానం
వాషింగ్టన్ లోని ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే క్రమంలో పీఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ను ఢీ కొట్టింది. దీంతో గాల్లోనే రెండు ముక్కలైన విమానం పోటోమాక్ నదిలో పడిపోయింది. హెలికాప్టర్ కూడా నిట్టనిలువుగా నదిలో పడిందని అధికారులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఆ సమయంలో నదిలో నీటి ఉష్ణోగ్రత -1 నుంచి -2 డిగ్రీలు ఉండొచ్చని అధికారులు చెప్పారు. నదిలో పడిపోయిన విమానంలోని ప్రయాణికులలో ఎవరైనా బతికి బట్టకట్టే అవకాశం తక్కువని అన్నారు. గాయాలకు తోడు గడ్డకట్టించే చలి కారణంగా వారి శరీర ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయి అరగంటలోపే మృత్యువాత పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.