Ranga Reddy District: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... లారీ దూసుకొచ్చి ఆరుగురు మృతి

Road accident in Ranga Reddy district
  • చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద లారీ బీభత్సం
  • కూరగాయల వ్యాపారుల పైకి దూసుకెళ్లిన లారీ
  • ఏడుగురి పరిస్థితి విషమం
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణలోని చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా లారీ వారి మీదకు దూసుకెళ్లింది. లారీ తమ వైపుకు దూసుకు రావడం చూసిన కూరగాయల విక్రయదారులు అక్కడి నుంచి పరుగు పెట్టారు.

అయితే వేగంగా వచ్చిన లారీ పలువురు పైనుంచి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. లారీ ఎంత వేగంతో వస్తుందంటే... ఆ వేగానికి అది ఢీకొట్టిన చెట్టు కూడా కూలిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. దాదాపు వంద మీటర్ల దూరం నుంచే లారీ అదుపు తప్పిన విషయాన్ని గుర్తించిన కూరగాయల వ్యాపారులు పరుగు పెట్టారు. కానీ కొంతమంది మృత్యువాత పడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

ఆలూరు స్టేజ్‌ వద్ద జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Ranga Reddy District
Road Accident
Hyderabad

More Telugu News