Jagan: జగన్ అక్రమాస్తుల కేసు... ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme court orders ED and CBI to submit all petitions details of Jagan case
  • కేసుల విచారణ ఆలస్యమవుతోందని రఘురామకృష్ణరాజు పిటిషన్
  • కింది కోర్టుల్లో పిటిషన్లపై పూర్తి వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ ఈనెల 13కు వాయిదా
వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 వారాల్లోగా వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్జి పిటిషన్లు, తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలను అందించాలని ఆదేశించింది. ఈడీ, సీబీఐ రెండూ విడివిడిగా చార్ట్ రూపంలో వివరాలను అందించాలని చెప్పింది. 

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేసు విచారణను మరో రాష్ట్రానికి వాయిదా వేయాలని పిటిషన్ లో ఆయన కోరారు. ఈ పిటిషన్ ను ఈరోజు జస్టిస్ ఓకా ధర్మాసనం విచారించింది. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని సుప్రీంకోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. 

ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ... ఇన్నేళ్లపాటు విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా... డిశ్చార్జి పిటిషన్లు, వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టులో విచారణ పెండింగే ఆలస్యానికి కారణమని న్యాయవాదులు తెలిపారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు ఇస్తే... తగిన ఆదేశాలను జారీ చేస్తామని చెప్పిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.
Jagan
YSRCP
Disproportionate Assets Case
Supreme Court
Raghu Rama Krishna Raju
Telugudesam

More Telugu News