Advertisement

అధికారంలోకి వచ్చాక వడ్డీ సహా చెల్లిస్తాం: అధికారులకు కేటీఆర్ హెచ్చరిక

KTR warns officers who are supporting congress
  • కాంగ్రెస్ అక్రమాలు, అవినీతిని బయటపెడతామని వ్యాఖ్య
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత వచ్చిందన్న కేటీఆర్
  • తెలంగాణలో 'ఆర్ఎస్' బ్రదర్స్ పాలన నడుస్తోందని ఎద్దేవా
  • సిరిసిల్ల కలెక్టర్‌కు కేటీఆర్ హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలు, అవినీతిని బయటపెడతామని, బీఆర్ఎస్ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ రాసుకుంటున్నామని... అధికారంలోకి వచ్చాక వడ్డీ సహా చెల్లిస్తామని అధికారులను హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న నిర్వహించ తలపెట్టిన దీక్షా దివస్ కార్యక్రమంపై జిల్లాస్థాయి సన్నాహక కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. చీకటిని చూస్తేనే ప్రజలకు వెలుగు విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలన చూశారు... ఇప్పుడు రేవంత్ రెడ్డి చీకటి పాలన చూస్తున్నారన్నారు. 14 ఏళ్ల పాటు కొట్లాడి... పదవులు త్యాగం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించుకున్నామన్నారు.

రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎవరిని అడిగినా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా ఆరు గ్యారెంటీలలో ఒక్కదానినీ అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్నారు.

తెలంగాణలో 'ఆర్ఎస్' బ్రదర్స్ పాలన సాగుతోందని రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై ఆగ్రహం

ఇక్కడి కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ నాయకులను పార్టీ మారాలని అడుగుతున్నాడట... ఇలాంటి సన్నాసిని కలెక్టర్‌గా తీసుకొచ్చారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్యకర్తలు ఎవ్వరూ భయపడవద్దని ధైర్యం చెప్పారు. రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని... అతి చేస్తున్న కలెక్టర్లు, అధికారులు రాసిపెట్టుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తే మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో చెల్లిస్తామన్నారు.
Advertisement
KTR
Revanth Reddy
Telangana
BRS

More Telugu News