Harish Rao: కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు: హరీశ్ రావు

Harish rao fires at Revanth Reddy
  • కనకపు సింహాసనమున' పద్యం సీఎంకు సరిగ్గా సరిపోతుందన్న హరీశ్ రావు
  • రేవంత్ రెడ్డి తప్పు మీద తప్పు చేస్తున్నారని మండిపాటు
  • మూసీ మురికి నీళ్లతో కడిగినా రేవంత్ నోటి మురికి పోదని వ్యాఖ్య
సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడని... సీఎం తన స్థాయిని దిగజారి మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 'కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!' అంటూ పద్యాన్ని కూడా రాసుకొచ్చారు. ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుందన్నారు.

రేవంత్ రెడ్డి తప్పుమీద తప్పు చేసి వదరబోతులా ప్రవర్తిస్తున్నారని, ఆయన తీరును ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. నీ పుట్టిన రోజు నాడు... తండ్రి వయసున్న కేసీఆర్ మీద, తెలంగాణ కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి మీద, నువ్వు చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయమని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. నీలాగా వికృతంగా మాట్లాడే ముఖ్యమంత్రిని ఈ దేశం ఎప్పుడూ చూసి ఉండదన్నారు. మూసీ నీళ్ళ మురికితో కడిగినా నీ నోరు మురికి పోదని... నీ వంకర బుద్ధి మారదని అన్నారు.

నీలాగా చిల్లరగా మేం మాట్లాడలేమన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధి పథంలో నడిపిన గంభీరమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. కానీ బ్యాగులు మోసి, బ్యాగులు పంచి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన నీచ చరిత్ర నీదని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. నీ దోపిడీని, నీ దొంగబుద్ధిని నిరూపించి ప్రజా క్షేత్రంలోనే నీకు బుద్ధి చెబుతాం అని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పిచ్చి ప్రగల్భాలు మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. నిరంకుశత్వాన్ని మానుకొని నిర్మాణాత్మక నిర్ణయాలపై శ్రద్ధ వహించాలన్నారు.

More Telugu News

Harish Rao
Revanth Reddy
Telangana
BRS