Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

former mp nandigam Suresh to 2 day police custody
  • వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ని రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి
  • శనివారం నుంచి రెండు రోజుల పాటు కస్టడీలో విచారించనున్న పోలీసులు
  • ఓ మహిళ హత్యకేసులో నందిగం సురేశ్‌ను ప్రశ్నించనున్న పోలీసులు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో గుంటూరు జిల్లా జైలులో నందిగం సురేశ్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులు మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారించిన కోర్టు 48 గంటల పాటు (రెండు రోజులు) కస్టడీకి అనుమతినిస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో సురేశ్‌ను ఈ రోజు (శనివారం) పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ రోజు, రేపు ఆయనను పోలీసులు కస్టడీలో విచారించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పోలీసులు ఆయనను ప్రశ్నించనున్నారు.  

కాగా, డిసెంబర్ 2020లో వెలగపూడిలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. నాడు ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ కేసులో సురేశ్ ను 78వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. 

More Telugu News

Nandigam Suresh
YSRCP
police custody