scr gm arun kumar: అమరావతికి త్వరలో కొత్త రైల్వే లైన్: జీఎం అరుణ్ కుమార్

railway line will be established in amaravati soon scr gm arun kumar
షార్ట్స్‌లో చూడండి
దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఏపీకి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటునకు సర్వే పూర్తి అయిందని జీఎం పేర్కొన్నారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు లైన్ సర్వే పూర్తయిందని, రైల్వే బోర్డు ఆమోదం, నిధులు మంజూరు కాగానే కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులతో శుక్రవారం విజయవాడ సత్యనారాయణపురం వద్ద ఉన్న ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు. 

రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని ఈ సందర్భంగా జీఎం తెలిపారు. తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.21వేల కోట్ల రైల్వే లైన్ల ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలు చేసిన ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు నివేదిస్తామని ఆయన తెలిపారు. పలు అభివృద్ధి  అంశాలపై తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. బడ్జెట్ లో ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు రూ.9,151 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. 

ఏపీలో రూ.21వేల కోట్ల పనులు జరుగుతున్నాయని, అందులో 1,687 కిలోమీటర్ల కొత్త, డబుల్, ట్రిపుల్ లైన్ పనులు ఉన్నాయని చెప్పారు. ఏపీలో 97 శాతం రైల్వే లైన్లు విద్యుదీకరణ జరిగాయని వివరించారు. గత మూడేళ్లలో తొమ్మిది ఆర్వోబీలు, 79 ఆర్‌యూబీలు నిర్మించామని, వివిధ స్టేషన్లలో 35 పుట్ ఓవర్ బ్రిడ్జ్ లు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మరో 12 బ్రిడ్జీలు ఈ ఆర్ధిక సంవత్సరంలో పూర్తి చేయనున్నామని తెలిపారు.
Go Back to Shorts
scr gm arun kumar
railway line
Amaravati

More Telugu News