లెజెండ్రీ నటుడు రఘువరన్ ఫ్యామిలీ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు

Things nobody knows about legendary actor Raghuvaran family
  • సినిమాల్లోనే విలన్... సాయానికి హీరో!
  • చివరి రోజుల్లో మత్తు పదార్థాలకు అలవాటు
  • భార్యాబిడ్డకు దూరంగా ఉంటూ చనిపోయిన వైనం! 
ఒకప్పుడు విలన్ పాత్రలకు లెజెండ్రీ నటుడు రఘువరన్ ఒక బ్రాండ్ గా ఉండే వారని చెప్పవచ్చు. ఆయన డైలాగ్స్, టైమింగ్... మిగిలిన విలన్ నటుల కంటే భిన్నంగా ఉండే ఆయన ఆటిట్యూడ్, వాయిస్ అందరినీ కట్టిపడేసేవి. అప్పట్లో స్టైల్ గా ఉండే విలన్ గా కూడా రఘువరన్ కి పేరు వచ్చింది. శివ, సుస్వాగతం, మాస్ లాంటి సినిమాలలో అద్భుతంగా నటించి మెప్పించారు. తెలుగు,తమిళ, కన్నడ చిత్రాల్లో 150 పైగా నటించి మెప్పించారు. తాజాగా, ఆయన తమ్ముడు, తల్లి ఓ ఇంటర్వ్యూలో రఘువరన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు . ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..

రఘువరన్ గురించి ఆయన బ్రదర్ రామ్ వరన్ మాట్లాడుతూ... "అన్నయ్య చాలా మంచి నటుడు. తను చేసిన ప్రతి సినిమా ప్రాణం పెట్టి చేసేవారు. డబ్బింగ్ కూడా అన్నయ్యే చెప్పేవారు. అన్ని భాషలు ఆయనకు తెలుసు. అన్ని భాషలకు ఆయన డబ్బింగ్ కూడా చెప్పుకునేవారు. మేము ముగ్గురం. చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం.  మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, ఆయన స్ఫూర్తితోనే నేను ఇవాళ నటిస్తున్నాను" అని రామ్ వరన్ వివరించారు.

రఘువరన్ గురించి ఆమె తల్లి కస్తూరి మాట్లాడుతూ... "రఘువరన్ చిన్నప్పటినుండి అందరికీ సహాయం చేసే గుణం కలిగిన వాడు. నా చేతి గాజులు, నగలు అమ్మి, చెన్నైకి పంపించాను. మొదట గిటార్ ప్లే చేసేవాడు. ఆ తరువాత మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తో కొంతకాలం గిటార్ ప్లే చేసిన తరువాత అనుకోకుండా మూవీస్ లో నటించాడు. రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. రఘువరన్ కి రజిని ఆప్తమిత్రుడిలా ఉండేవాడు. 

తమిళంలో ఎక్కువ రజినీతోనే సినిమాలు చేశాడు. చిన్నప్పటినుండి  ఇంట్లో పెద్ద కొడుకు కావడంతో అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉండేది. పెళ్లి కూడా తనకి ఇష్టమైన అమ్మాయిని చేసుకున్నాడు. 2000లో వాళ్ల పెళ్లి జరిగింది. అనుకోని కారణాలతో వాళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి 2004లో విడాకులు ఇవ్వడం జరిగింది. కానీ ఆమె కూడా చాలా మంచిది. రోహిణి ఇప్పటికీ మాతో మాట్లాడుతుంది" అని కస్తూరి తెలిపారు.

రఘువరన్ మరదలు ధనలక్ష్మి స్పందిస్తూ... రఘువరన్ గారు డ్రగ్స్ కి అలవాటు పడి చనిపోయారని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. దీని గురించి మీరు ఏమంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన మరదలు మాట్లాడుతూ.. మా బావగారికి డ్రగ్స్ అలవాటు ఉన్న మాట నిజమే. కానీ సినీ ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఆ విషయం పెద్దదిగా చూపిస్తూ  మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ ఆయన అంత ఎక్కువగా డ్రగ్స్ కి అలవాటు పడలేదు. విడాకులు అయిన తర్వాత తన కొడుకు గురించి బాధపడుతూ మత్తు పదార్థాలకు ఎక్కువగా అలవాటు పడ్డారు. రజినీకాంత్ గారితో చివరి మూవీ చేశారు. హార్ట్ ఎటాక్ తో 49 ఏళ్లకే మరణించారు. ఇప్పటికీ రఘువరన్ ఫ్యామిలీ అని మాకు అందరూ చాలా గౌరవం ఇస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు" అని తెలిపారు.

రఘువరన్ గారు అప్పట్లో చాలా సినిమాలు తీశారు మీకు ఫైనాన్షియల్ గా ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు మీరు ఒక చిన్న సింగిల్ బెడ్ రూమ్ లో ఉండడానికి కారణం ఏంటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ధనలక్ష్మి మాట్లాడుతూ... "ఆయన సంపాదించింది ఆయన ఫ్యామిలీకి మాత్రమే చెందింది. మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నాము. చెన్నైలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు బెంగళూరుకి వచ్చిన తర్వాత మావారు చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తున్నారు. సినిమాలలో నటిస్తూ మేము బాగానే ఉన్నాము. రఘువరన్ గారికి బ్రదర్ ఉన్నారని తెలియడం కోసమే మేము ఇంటర్వ్యూలు ఇస్తున్నాం" అని తెలిపారు.


Go Back to Shorts
Raghuvaran
Villain
Actor

More Telugu News