ఫోన్ ట్యాంపింగ్ కేసు నిందితుడు భుజంగరావుకు మధ్యంతర బెయిలు

Phone Tapping Case Accused Bhujanga Rao Gets Interim Bail
  • ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న భుజంగరావు
  • అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిలు ఇవ్వాలంటూ పిటిషన్
  • 15 రోజుల మధ్యంతర బెయిలు మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
  • తమకు చెప్పకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన నాంపల్లి కోర్టు 15 రోజులపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్‌ను విడిచి వెళ్లరాదని ఆదేశించింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 23న భుజంగరావు అరెస్ట్ అయ్యారు. బెయిలు కోసం ఇప్పటికే ఆయన పలుమార్లు పెట్టుకున్న పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తొలుత మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్ట్ అయ్యారు. ఆయన ఇచ్చిన సమాచారంతో అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు రెడ్ కార్నర్ నోటీసు జారీచేశారు.
Go Back to Shorts
Phone Tapping Case
Telangana
Bhujangarao
Nampally Court

More Telugu News