రుణమాఫీ జమ కాని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ
- రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందవద్దని సూచన
- త్వరలో నగదు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ
- రెండో విడత మాఫీకి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి
మొదటి విడతగా లక్ష రూపాయల లోపు రుణాలకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు రూ.6,098.94 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. వీటిలో ఆర్బీఐ సమాచారం ప్రకారం 11.32 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,014 కోట్లు జమ అయినట్లు వెల్లడించారు. కొన్ని సాంకేతిక కారణాలతో 17,877 ఖాతాలకు చెందిన రూ.84.94 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో పడలేదన్నారు. రైతులు కంగారు పడవద్దని, వారి ఖాతాల్లోనూ త్వరలో నగదు జమ అవుతుందన్నారు.
దీనిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని రైతులకు సూచించారు. ఆర్బీఐ సూచించిన వివరాల ప్రకారం సాంకేతిక సమస్యలు సరిచేసి ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్య బ్యాంకులకు అనుసంధానం చేయబడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(సీడెడ్ సంఘాలు)కు సంబంధించి మిగిలిన 15,781 రుణ ఖాతాల తనిఖీ సోమవారంతో పూర్తవుతుందన్నారు. అనంతరం ఆ ఖాతాలకు సైతం రుణమాఫీ నిధులు విడుదల చేస్తామన్నారు.