‘పుట్టిన రోజే చనిపోయే రోజు’ అని మెసేజ్ పెట్టి అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో
- 15న పని ఉందని చెప్పి మచిలీపట్టణం వెళ్లిన వెంకటరమణారావు
- అదే రోజు అర్ధరాత్రి దాటాక కుటుంబ సభ్యులకు మెసేజ్
- ఆయన కోసం గాలిస్తున్న పోలీసులు
విజయవాడ సమీపంలోని కానూరు మహదేవపురంలో ఉండే వెంకటరమణారావు నరసాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టిన ఆయన కానూరు వచ్చారు. 15న పని ఉందని, మచిలీపట్టణం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి, బయటకు వెళ్లారు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి ఫోన్ చేసి తాను బందరులో ఉన్నట్టు చెప్పారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ ఆఫ్ అయింది. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత ‘నా పుట్టిన రోజైన 16వ తేదీయే.. నేను చనిపోయే రోజు కూడా. అందరూ జాగ్రత్త’ అని కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపారు.
అది చూసి అప్రమత్తమైన కుటుంబ సభ్యులు నిన్న ఉదయం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వెంకటరమణారావు వాహనం మచిలీపట్టణం రైల్వేస్టేషన్లోఉన్నట్టు గుర్తించారు. దీంతో మచిలీపట్టణం, విజయవాడలో ఆయన కోసం గాలిస్తున్నారు. వెంకటరమణారావు కనిపించకుండా పోవడానికి మాధవాయిపాలెం పెర్రీ రేవు పాటదారు 54 లక్షల రూపాయల బకాయిలు ఉండడమే కారణమని తెలుస్తోంది.