నైనీ వద్ద బొగ్గు గనుల తవ్వకానికి సింగరేణికి సహకరిస్తాం: భట్టివిక్రమార్కకు ఒడిశా సీఎం హామీ

Bhattivikramarka Met Odisha Chief Minister
  • సింగరేణికి బొగ్గు గనుల ఆవశ్యకతను వివరించిన భట్టివిక్రమార్క
  • 2017లోనే నైనీ గనులను సింగరేణికి కేటాయించినట్లు వెల్లడి
  • పర్యావరణ, పారిశ్రామిక అనుమతులు వచ్చాయన్న ఉపముఖ్యమంత్రి
  • అటవీ, ప్రైవేటు భూముల అంశం పరిష్కరించాలని విజ్ఞప్తి
నైనీ వద్ద బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని భట్టివిక్రమార్క భువనేశ్వర్ లోని సెక్రటేరియట్ లో కలిశారు. ఒడిశాలోని నైనీ వద్ద సింగరేణి సంస్థ చేపట్టిన బొగ్గు గని ప్రాజెక్టులో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆ రాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించారు.

నైనీ బ్లాక్‌లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరడానికి అధికారుల బృందంతో కలిసి భట్టివిక్రమార్క ఒడిశా ముఖ్యమంత్రిని కలిశారు. బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తానని హామీ ఇచ్చిన మోహన్ చరణ్... ఆ దిశగా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సింగరేణికి బొగ్గు గనుల ఆవశ్యకతను భట్టివిక్రమార్క వివరించారు. 2017లోనే నైనీ గనులను సింగరేణికి కేటాయించినట్లు తెలిపారు. నైనీ బ్లాక్‌లో తవ్వకాలకు సంబంధించి పర్యావరణ, పారిశ్రామిక అనుమతులు వచ్చినట్లు సీఎంకు తెలిపారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం మాత్రం పెండింగ్‌లో ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారమైతే సింగరేణి అక్కడ తవ్వకాలను ప్రారంభిస్తుందన్నారు.

నైనీ బ్లాక్‌లో తవ్వకాలు చేపడితే ఒడిశా యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని, పన్నుల రూపంలో రూ.600 కోట్ల వరకు ఒడిశా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వివరించారు. ఈ క్రమంలో భూముల బదలాయింపు, విద్యుత్, రోడ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ అంశాలను పరిష్కరించాలని ఒడిశా సీఎం కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Go Back to Shorts
Mallu Bhatti Vikramarka
BJP
Singareni Collieries Company
Coal Mines
Odisha

More Telugu News